జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డ పవన్, సమావేశం మధ్యలోనే ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయిన ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
లడ్డూ వ్యవహారం చుట్టూ ఇంత జరుగుతున్నా పార్టీ తరఫున ఒక్క నాయకుడు కూడా గట్టిగా స్పందించకపోవడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “వైసీపీపై ఎందుకు గట్టిగా ఎదురుదాడి చేయడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడాలా? అలా అయితే మీరు ఎందుకు?” అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పార్టీపై విమర్శలు వస్తున్నప్పుడు స్పందించే బాధ్యత నేతలదేనని, కానీ ఆ స్థాయిలో ఎవరూ పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. “అందరి పనితీరుపై నాకు పూర్తి సమాచారం ఉంది. ఎవరు ఏమి చేస్తున్నారు అనే చిట్టా నా దగ్గరే ఉంది” అంటూ వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించబోనని కూడా సూచించారు. ఈ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేశంతో సమావేశాన్ని వదిలి వెళ్లిపోయారు. వెళ్లే ముందు పార్టీ వ్యవహారాలపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని నాదెండ్ల మనోహర్కు ఆదేశాలు ఇచ్చారు. ఎవరు ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అన్న దానిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఆగ్రహం, సమావేశం నుంచి వెళ్లిపోవడం జనసేనలో అంతర్గత అసంతృప్తి ఎంత లోతుగా ఉందో సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నేతలు ఇకనైనా కార్యాచరణలో మార్పు తీసుకురాకపోతే కఠిన నిర్ణయాలు తప్పవన్న సంకేతంగా పవన్ వైఖరిని వారు అంచనా వేస్తున్నారు.







