టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆన్-ఫీల్డ్ అంపైర్పై అసహనం వ్యక్తం చేసిన కారణంగా, పంత్పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ రెండు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినట్లు రుజువైతే పంత్కు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.
అసలేం జరిగింది?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లోని 61వ ఓవర్లో మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని హ్యారీ బ్రూక్ బౌండరీకి పంపించాడు. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బంతిని మార్చాలని ఆన్-ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ను కోరారు. బంతిని బాల్ గేజ్ ద్వారా పరిశీలించిన అంపైర్, బంతి అంతా బాగుందని, ఇంకా ఆడేందుకు అనుకూలంగా ఉందని చెప్పాడు. దాంతో పంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాదించాడు. అంపైర్ ససేమిరా అనడంతో, బంతిని మైదానంలోకి విసిరి వెళ్లిపోయాడు. అంతేకాదు, ఏదో మాట్లాడుతూ వెనక్కి తిరిగాడు. పంత్ ప్రవర్తనపై అప్పుడే వ్యాఖ్యాతలు కూడా స్పందించారు. ఇది మంచి పద్ధతి కాదని కామెంటేటర్ మార్క్ బౌచర్ అన్నాడు.
ఐసీసీ నియమావళి ఉల్లంఘనలు:
మైదానంలో ఆన్-ఫీల్డ్ అంపైర్తో వాదించినందుకు రిషబ్ పంత్కు రెండు నిబంధనల ఉల్లంఘన కారణంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8లోని లెవెల్ 1 కింద అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు పంత్ను దోషిగా పరిగణించవచ్చు. క్లాజ్ (ఎ), క్లాజ్ (హెచ్) కింద అంపైర్ నిర్ణయంపై సుదీర్ఘ చర్చలు జరిపినందుకు చర్యలు తీసుకోవచ్చు. అలాగే, కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినందుకు కూడా దోషిగా పరిగణించవచ్చు. ఐసీసీ నుంచి పంత్ ఆంక్షలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. జరిమానాతో పాటు, మ్యాచ్ నిషేధం కూడా పడే అవకాశం ఉంది.హెచ్చరికతో సరిపెడతారా? లేదా మ్యాచ్ బ్యాన్ చేస్తారా? అన్నది చూడాలి.