భారత్-పాక్ సరిహద్దు (India-Pakistan border) వద్ద వాతావరణం యుద్ధమయం అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా, భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)” తరువాత పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు (Pakistan Stock Markets) చరిత్రలోనే కనీవినీ ఎరుగని పతనాన్ని నమోదు చేశాయి.
గురువారం ట్రేడింగ్ సెషన్లో కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ (KSE-100) సూచీ ఒకే రోజు 2,100 పాయింట్లకు పైగా పడిపోయింది, ఇది గత ఐదేళ్లలో అతి పెద్ద పతనంగా నమోదైంది. శుక్రవారం కూడా నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే అమ్మకాలు పెరిగిపోయాయి. పాకిస్తాన్ రూపాయి విలువ కూడా అత్యల్పస్థాయికి పడిపోయింది.
ప్రముఖ రంగాల్లో తీవ్ర నష్టం
బ్యాంకింగ్, ఎనర్జీ, టెలికం రంగాలు అత్యధిక నష్టాన్ని చవిచూశాయి. విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకుంటుండటంతో నష్టాలు మరింత పెరిగాయి. ఆయిల్ ధరలు పెరగడం, దిగుమతులపై ఆధారపడే పాకిస్తాన్కి ఇది ఆర్థికంగా దెబ్బతీసే అంశంగా మారింది.
జియోపాలిటికల్ భయం – పెట్టుబడిదారుల పానిక్
భారత వాయుసేన పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపడం, పాకిస్తాన్ వైమానిక దళం యత్నించిన ప్రతీకార దాడులకు భారత వాయుసేన ప్రతిస్పందించిన తీరుతో పరిస్ధితి తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మార్కెట్లలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా మారి పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. పాక్ స్టేట్ బ్యాంక్ ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించి పాక్షిక మారిన మార్కెట్ సెంటిమెంట్ను నిలిపేందుకు చర్యలు చేపట్టింది. కానీ విదేశీ రిజర్వులు ఇప్పటికే తగ్గిపోయిన నేపథ్యంలో, వ్యవస్థను నిలబెట్టడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.