సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత ప్రధానమంత్రి మోడీ ప్రసంగం తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వాస్తవాధీన రేఖ వెంట పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి.
ఈ దాడులు ముఖ్యంగా సాంబా, ఆర్నియా సెక్టార్లను లక్ష్యంగా చేసుకున్నాయి. మళ్లీ మళ్లీ జరుగుతున్న కాల్పులు ఈ ప్రాంతాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అంతేకాకుండా, డ్రోన్ల ద్వారా పాక్ చొరబాట్లు చేసేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం. డ్రోన్ కదలికలు గుర్తించిన భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని సమాచారం. జమ్మూకశ్మీర్ సాంబా సెక్టార్లో పాక్ నుంచి దూసుకువచ్చిన డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది.
పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు ప్రాంతాల్లో హెచ్చరికగా బ్లాకౌట్ విధించడంతో, హోషియార్పూర్ వంటి ప్రాంతాల్లో సైరన్లు మోగించాల్సిన పరిస్థితి నెలకొంది. పాక్ దాడికి భారత బలగాలు సమర్థంగా సమాధానం ఇస్తున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను కట్టడి చేస్తున్నామని తెలిపాయి. పాక్ తీరుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.