ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ చేసిన వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన తర్వాత కూడా కాలేజీ యాజమాన్యం వారికి హాల్ టికెట్లు ఇవ్వలేదు. పరీక్ష రోజు ఇస్తామని చెప్పి, చివరికి విద్యార్థులను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లకపోవడం కలకలం రేపింది.
వివరాలు ఇలా ఉన్నాయి
బైరాగిపట్టెడలోని ఓం ఎస్వీవీ కాలేజీ తొమ్మిది మంది విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించింది. హాల్ టికెట్ అడిగితే, పరీక్ష రోజు ఇస్తామని మాటిచ్చింది. అయితే, ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్ష రోజు విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని, పరీక్ష కేంద్రం వద్దకు కాకుండా తిరిగి వారి ఇంటి దగ్గరే దింపేశారు. దీనితో విద్యార్థులు షాక్కి గురై, వెంటనే తమ తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు.
తల్లిదండ్రుల ఆగ్రహంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పరీక్ష రాయించకపోవడంపై కాలేజీ యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ గొడవను తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల జోక్యంతో మిగతా విద్యార్థులను ఎగ్జామ్ రాయించేందుకు తీసుకెళ్లారు.