ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 18వ సీజన్ ఈనెల 22న ఘనంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్లు మే 25 వరకు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కత్తా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 18 సీజన్లో బీసీసీఐ కొన్ని కఠినమైన నిబంధనలను అమలు చేయనుంది.
ముఖ్యంగా ఆటగాళ్లు, స్టాఫ్ తప్ప కుటుంబ సభ్యులను డ్రెస్సింగ్ రూమ్లోకి అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇకపై ఆటగాళ్లు మ్యాచులు, ప్రాక్టీస్ సెషన్లకు తప్పనిసరిగా జట్టు బస్సులోనే ప్రయాణించాలని, అంతేకాకుండా, అవార్డు ప్రదాన కార్యక్రమాల్లో స్లీవ్లెస్ జెర్సీలను ధరించకూడదని సూచించింది.
ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే, మొదట హెచ్చరికతో సరిపెట్టి, ఆ తరువాత కూడా రూల్స్ అతిక్రమిస్తే జరిమానా విధించే అవకాశం ఉందని BCCI స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాల ద్వారా IPL 2025 సీజన్ను మరింత క్రమబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలుగా భావించవచ్చని బీసీసీఐ అభిప్రాయపడింది.