యెమెన్లో (Yemen) ఉరిశిక్ష పడిన కేరళ నర్సు (Kerala Nurse) నిమిష ప్రియ (Nimisha Priya) విషయంలో భారత ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో అటార్నీ జనరల్ వెంకటరమణి మాట్లాడుతూ, భారత్-యెమెన్ మధ్య దౌత్య సంబంధాలు లేనందున, ఉరిశిక్షను ఆపేందుకు లేదా వాయిదా వేసేందుకు పరిమిత మార్గాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ‘బ్లడ్ మనీ’ (Blood Money) అనేది ప్రైవేటు సంప్రదింపుల విషయమని స్పష్టం చేశారు.
జూలై 16న మరణశిక్ష అమలు కానుండటంతో, నిమిష ప్రియ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ సందీప్ మెహతా ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె ప్రాణాలు కోల్పోతే అది బాధాకరమని అన్నారు. నిమిష ప్రియను రక్షించాలని కోరుతూ కేరళ సీఎం (Kerala CM) పినరయ్ విజయన్ (Pinarayi Vijayan) ప్రధాని మోడీకి (Modi) లేఖ రాశారు.
కేసు వివరాలు: 2008లో యెమెన్ వెళ్లిన నిమిష ప్రియ, స్థానిక భాగస్వామి తలాల్ అదిబ్ మెహదితో కలిసి క్లినిక్ ప్రారంభించింది. మెహది వేధింపులు, బెదిరింపులు, పాస్పోర్టు స్వాధీనం చేసుకోవడంతో, 2017లో అతనికి మత్తుమందు ఇవ్వగా, మోతాదు ఎక్కువై మరణించాడు. మృతదేహాన్ని వాటర్ ట్యాంక్లో పడేసినందుకు ఆమెను అరెస్టు చేశారు. మృతుడి కుటుంబానికి ‘బ్లడ్ మనీ’గా మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.6 కోట్లు) చెల్లించడానికి నిమిష కుటుంబం సిద్ధంగా ఉన్నా, ఇప్పటికీ స్పందన రాలేదు.