పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర వైద్య నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి ఆస్పత్రిలో చేరిన మహిళ కడుపులో సర్జికల్ బ్లేడ్ వదిలేసిన దారుణ ఘటన స్కానింగ్లో బయటపడడం సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. బాలయ్యనగర్ నివాసితురాలు రమాదేవి (22) అనే యువతి కడుపు నొప్పితో నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. కడుపు నొప్పికి డాక్టర్ నారాయణ స్వామి మరియు అతని సిబ్బంది శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తరువాత కూడా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా, వైద్య సిబ్బంది “నొప్పి సహజం” అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నొప్పి తగ్గకపోవడంతో రమాదేవి స్కానింగ్ చేయగా ఆమె తోడ భాగంలో సర్జికల్ బ్లేడు వదిలేసినట్లుగా కనిపించింది. ఆపరేషన్ సమయంలోనే వైద్య సిబ్బంది బ్లేడు మరిచిపోయినట్లు బయటపడటంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. చిన్నశస్త్రచికిత్సలో ఇలాంటి పెద్ద పొరపాటు జరగడం ఆసుపత్రి నిర్వాకాన్ని స్పష్టంగా చూపిస్తోందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో నరసరావుపేట ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని రమాదేవి బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. చిన్న ఆపరేషన్కు కూడా సిబ్బంది రూ.2,500 వసూలు చేశారనే ఆరోపణలు ముందుకు రావడంతో విమర్శలు మరింత తీవ్రం అవుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.








