సినీ నటుడు, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు ఊరటనిచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా 16 కేసులు నమోదయ్యాయి.
నరసరావుపేట 2 టౌన్ ఠాణాలో నమోదైన కేసులో నరసరావుపేట జూనియర్ సివిల్ జడ్జి పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోసాని బెయిల్ పొందేందుకు రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదే సమయంలో, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులోనూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.







