తిరుపతిలోని ప్రముఖ నటుడు మోహన్బాబు యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యూనివర్సిటీలో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని నిన్న రాత్రి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని మృతిచెందిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
పుంగనూరు మండలం మంగళం పంచాయతీకి చెందిన సురేంద్ర, జానకీల కుమారై భూవన (21) చంద్రగిరి మండలం రంగంపేటలోని ఎంబీయూ కళాశాలలో డేటా సైన్స్లో చివరి సంవత్సరం చదువుతూ సాయి తేజ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. గత రాత్రి తన రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
సహ విద్యార్థులు గమనించి యాజమాన్యానికి సమాచారం అందించగా, అనంతరం ఈ విషయం తల్లిదండ్రులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే, తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కళాశాల వద్ద భువన తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రూయా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
ఇటీవల మోహన్బాబు యూనివర్సిటీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఫీజుల పెంపు అంశంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టగా, ఆ సమయంలో విద్యార్థి నాయకులను తన బౌన్సర్లతో కిడ్నాప్ చేయించారన్న ఆరోపణల నేపథ్యంలో మోహన్బాబు, మంచు విష్ణుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ ఘటనల తరువాత ఈ ఆత్మహత్య ఘటన చోటుచేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.








