తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి కేంద్రం నుంచి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో నీట్ (NEET) ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని డీఎంకే ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తిరస్కరించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) ప్రకటించారు.
2021, 2022లో రెండు దఫాలుగా నీట్ వ్యతిరేక బిల్లు (Anti-NEET bill) ను రాష్ట్ర శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ ఇది ఇప్పుడు తిరస్కరణకు గురవ్వడంతో డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్టాలిన్ మాట్లాడుతూ ‘‘మేము పూర్తి ఆధారాలతో బిల్లును పంపించినా కేంద్రం మినహాయింపును నిరాకరించింది. ఇది దక్షిణాది రాష్ట్రాలపట్ల బీజేపీ చూపుతున్న తీరును బాగా చూపిస్తోంది’’ అన్నారు.
కేంద్రంపై పోరాటం ఆగదు
రాష్ట్రపతి తిరస్కరణకు న్యాయపరమైన పోరాటం తప్పదని స్టాలిన్ స్పష్టం చేశారు. ఇప్పటికే న్యాయపండితులను సంప్రదిస్తున్నామని, ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే త్రిభాషా విధానం (Three-Language Policy), డీలిమిటేషన్ (Delimitation) వంటి వివాదాలపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న డీఎంకే ప్రభుత్వం, తాజాగా నీట్ వ్యవహారాన్ని మరో రాజకీయ ఆయుధంగా మలుచుకునే అవకాశముంది.