రాయచోటి జిల్లా కేంద్రాన్ని కాపాడుకోకుంటే తన మీసం తీసేస్తానని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసి చంద్రబాబు ప్రభుత్వ తీరుతో చివరకు కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. చాలా రోజుల గ్యాప్ తరువాత మళ్లీ వార్తల్లోకి వెక్కారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు, భవిష్యత్తుపై ఆయన వ్యక్తం చేసిన ఆందోళన చూస్తుంటే మంత్రికి అప్పుడే ఓటమి భయం పట్టుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక సంస్థలకు అభ్యర్థులు కరవు?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేశాయి. రాయచోటి మున్సిపాలిటీలో ఉన్న 42 వార్డులకు పోటీ చేయడానికి ప్రస్తుతం పార్టీలో అభ్యర్థులే లేరని ఆయన బహిరంగంగా అంగీకరించడం గమనార్హం. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి గాలి వీచినా, రాయచోటిలో మాత్రం ఆ ప్రభావం ఆశించిన స్థాయిలో లేదని ఆయన వాపోయారు.
పొత్తుపై పరోక్ష విమర్శలు – ఈవీఎంలపై సందేహాలు?
బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని బూత్లలో ఫలితాలు చాలా దారుణంగా (చెత్తగా) వచ్చాయని మంత్రి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అదే విధంగా 89 బూత్లలో అసలు కూటమికి ఓట్లే పడలేదని ఆయన పేర్కొన్నారు. “రాష్ట్రంలో ఇంతకంటే మెజారిటీ భవిష్యత్తులో ఎప్పుడూ రాదు.. రాబోదు” అని వ్యాఖ్యానిస్తూనే, ఈ గెలుపు కేవలం సాంకేతికం అన్నట్లుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రం మార్పు తర్వాత రాయచోటిలో టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని ఆయన వ్యాఖ్యల్లో ఆవేదన కనిపిస్తోందంటున్నారు సొంత పార్టీ నేతలు.
రాబోయే కష్టాలను ఊహించుకోండి!
కార్యకర్తల్లో చిత్తశుద్ధి తగ్గకూడదని కోరుతూనే, భవిష్యత్తులో ఎదురయ్యే గడ్డు పరిస్థితులపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు. “కార్యకర్తలు రేపు రాబోయే కష్టాలను ఇప్పుడే ఊహించుకోవాలి. ఆషామాషీగా ఉండకండి. పార్టీలో సొంత వారే శత్రువులుగా తయారవుతున్నారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీని గెలిపించాలని ఆయన అనడం, ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆయనకే స్పష్టత లేదన్న సంకేతాలను ఇస్తోంది.
అయోమయంలో కేడర్
ఒకవైపు అధికారంలో ఉండి, మంత్రి పదవిలో ఉండి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అభ్యర్థులు లేరని, కష్టాలు రాబోతున్నాయని మంత్రి వ్యాఖ్యానించడం రాయచోటి టీడీపీ కేడర్ను అయోమయంలో పడేసింది. జిల్లా కేంద్రం మార్పు అంశం ఇప్పటికీ ప్రజల్లో అసంతృప్తిగా ఉందని మంత్రి మాటల ద్వారా స్పష్టమవుతోంది.







