ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి సభలో మాట్లాడారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయని గవర్నర్తో అబద్ధం చెప్పించారన్న అంశాన్ని వైసీపీ ఎమ్మెల్సీ లేవనెత్తారు. ఎక్కడో, ఏ శాఖలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు.
ప్రతిపక్ష సభ్యురాలి ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం విడ్డూరంగా ఉంది. ఉద్యోగాలు కల్పించామనే చెప్పాం.. కానీ ఇప్పుడే కల్పించామని ఎక్కడా అనలేదని లోకేశ్ ఇచ్చిన ఆన్సర్పై సెటైర్లు పేలుతున్నాయి. అది కేవలం పొటన్షియల్..ఇది కరెక్టు కాదన్నారు. దీంతో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కలగజేసుకొని 4లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారు? అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉందని, కరెక్ట్ చేసుకుంటే తప్పు ఏంటీ.. దానికి వచ్చిన ఇబ్బంది ఏంటీ..?, సారీ సర్ తప్పుగా ఉందని ఒప్పుకుంటే తప్పేంటీ..? అని మంత్రి లోకేశ్ను, అధికార పక్ష సభ్యులను ప్రశ్నించారు.
సభలో అరేయ్ అంటూ..
ఇదే ప్రశ్నపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. ` నా దగ్గర ఇంగ్లిష్ కాపీ ఉంది, చాలా స్పష్టంగా చెబుతున్నాను. అరేయ్.. ఇంగ్లిష్ మీడియం అని ఊదగొట్టారు.. ఇంగ్లిష్ లో చెబుతున్నారాబై.. అరే ఎట్లరాబై.. అంటూ సభలో ప్రతిపక్ష సభ్యులపై దురుసుగా ప్రవర్తించారు. మండలి ప్రతిపక్ష సభ్యులపై మంత్రి లోకేశ్ నోరుపారేసుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన మంత్రి, సహనం కోల్పోయి అరేయ్ అంటూ వ్యాఖ్యానించారు.