సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా నిలుస్తూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి తన ప్రతీక్ ఫౌండేషన్ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రేవతి కుమారుడు శ్రీతేజ్కు అవసరమైన వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు.
ప్రీమియర్ షోలో విషాదం..
‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగగా, రేవతి అనే మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులో పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
ఈ ఘటన చాలా బాధాకరం అని, బాధిత కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఆ కుటుంబ ఆర్థిక, వైద్య అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.