మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్ను కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రతిపక్ష పార్టీల నేతల వ్యాపార సంస్థలపై వేధింపులు పెంచడమే లక్ష్యమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రభాకర్కు పోస్టింగ్ ఎలా కుదిరింది?
కూటమి ప్రభుత్వంలో కింజరాపు ప్రభాకర్కు రిటైర్మెంట్కు ఒక రోజు ముందు అదనపు ఎస్పీ పదోన్నతి ఇచ్చి, ఆ తరువాత ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా నియమించింది. సాధారణంగా ఓఎస్డీగా నియమించిన వ్యక్తిని విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఉంచుతారు. కానీ, ప్రభాకర్ను నేరుగా విశాఖపట్నం ప్రాంతీయ విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారి (ఆర్వీఈవో)గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో నియామకం జరిగిందని, విశాఖలో ఆర్వీఈవోగా ఉన్న జి. శ్రీనివాస్ రావుని బదిలీ చేసి అచ్చెన్న అన్న ప్రభాకర్కి పోస్టింగ్ ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రతిపక్ష పార్టీ విమర్శలు
ఈ వ్యవహారం చుట్టూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట జరుగుతున్న ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, సరికొత్త సంక్షోభాలకు దారితీస్తాయని అభిప్రాయపడ్డాయి. విజిలెన్స్ శాఖను రాజకీయ ప్రత్యర్థులను వేధించే సాధనంగా ఉపయోగించదలిచిందని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నాయకుల వ్యాపార సంస్థలపై తప్పుడు నివేదికలు సృష్టించి, అక్రమ కేసులు బనాయించడం ఈ వ్యూహంలో భాగమని ఆరోపణలు ఉన్నాయి.