పెరుగుతున్న టెక్నాలజీ (Technology) ని ఉపయోగించుకొని కొంతమంది అద్భుత ఆవిష్కరణలు చేస్తే, మరికొందరు అదే టెక్నాలజీతో మోసాలకు పాల్పడుతున్నారు. కొత్తగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే సంఘటనపై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మార్కెట్ (Market)లో నకిలీ నోట్లు (Fake Currency Notes) హల్చల్ చేస్తున్నాయని, కొందరు కేటుగాళ్లు రూ.500 నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) గుర్తించింది.
పౌరులు అప్రమత్తంగా ఉండాలి
ఈ విషయంపై హోంశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తాజాగా వచ్చిన “ఫర్జీ (Farzi)” వెబ్ సిరీస్ లో చూపినట్లే.. ఒరిజినల్ నోట్లలాగే ఫేక్ నోట్లు కనిపిస్తున్నాయనీ, చక్కటి ప్రింటింగ్తో మోసం చేస్తూ ఉండడంతో వాటిని గుర్తించడం సాధ్యపడడం లేదని హోంశాఖ తెలిపింది.
ఆ చిన్న తప్పు గమనించండి..
నిజమైన నోటుతో పోల్చితే, ఈ నకిలీ నోట్లలో ఓ చిన్నస్పెల్లింగ్ మిస్టేక్ ఉందని, అదే ఆధారంగా వాటిని గుర్తించవచ్చని హోంశాఖ తెలిపింది. అసలైన నోట్లలో “RESERVE BANK OF INDIA”* అని రాసి ఉండాలి. అయితే ఫేక్ నోట్లలో “RESERVE” అనే పదంలో చివరి “E” అక్షరం స్థానంలో “A” ముద్రించబడి ఉంటుందని, దీని ఆధారంగా నకిలీ రూ.500 నోట్లను గుర్తించవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది.
ముఖ్యమైన సూచనలు
ఈ ఫేక్ నోట్ల వ్యవహారంపై డీఆర్ఐ (DRI), ఎఫ్ఐయూ (FIU), సీబీఐ (CBI), ఎన్ఐఏ (NIA), సెబీ (SEBI) వంటి కీలక దర్యాప్తు సంస్థలతో కేంద్రం ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశముండటంతో, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా నకిలీ నోట్లు మార్కెట్లో వ్యాపార లావాదేవీల్లో కలిసిపోవడంతో, ప్రతి ఒక్కరు నోట్లను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. చిన్న తప్పుతో కూడిన ఈ మోసాల్ని గమనించాలంటే ప్రజల దృష్టి మరియు అప్రమత్తతే ఆయుధమని అధికారులు స్పష్టం చేశారు.







