ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత్ (India)కు వచ్చిన ప్రతిసారి అభిమానుల్లో ఒకే ఆశ “మైదానంలో మెస్సీని ఆడుతూ చూడాలి” అని, కానీ ఈసారి ఆ కల నెరవేరలేదు. మెస్సీ భారత్లో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం వయస్సు కాదు.. అలసట కాదు.. అతని ఎడమ కాలుకు (Left Leg) ఉన్న ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీ (Expensive Insurance Policy) అని తెలుస్తోంది.
భారత్లో మెస్సీ మ్యాచ్ ఎందుకు ఆడటం లేదు?
ప్రస్తుతం GOAT Tour 2025లో భాగంగా మెస్సీ మూడు రోజుల ప్రత్యేక పర్యటనకు భారత్కు వచ్చారు. కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమాలు, సత్కారాలు, అభిమానులతో భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో ఎటువంటి అధికారిక ఫుట్బాల్ మ్యాచ్లు లేదా టోర్నీలు లేవు. అందుకే మెస్సీ మైదానంలోకి దిగలేదు. అభిమానుల ముందు ఒక్కసారి బాల్ తన్నిన దృశ్యాలు కనిపించినా, పూర్తిస్థాయి మ్యాచ్ మాత్రం ఆడలేదు.
అభిమానుల ఆశలు ఆవిరి
భారత్లో లక్షలాది మంది ఫుట్బాల్ అభిమానులు మెస్సీ మ్యాచ్ ఆడటం చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ప్రస్తుత షెడ్యూల్లో క్లబ్ మ్యాచ్లు లేదా అంతర్జాతీయ పోటీలు లేకపోవడంతో, 38 ఏళ్ల మెస్సీ ఆటకు దూరంగా ఉన్నారు.
మీడియా కథనాల ప్రకారం, మెస్సీ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అథ్లెట్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒకటి ఉంది. మెస్సీ ఎడమ కాలుకు సుమారు $900 మిలియన్ (రూ.7,600 కోట్లు) ఇన్సూరెన్స్ తీసుకున్నట్లు సమాచారం. ఈ భారీ మొత్తం కారణంగానే అతను అధికారికంగా అనుమతించని మ్యాచ్లలో ఆడే రిస్క్ తీసుకోవడం లేదు.
మెస్సీ బీమా పాలసీలో కీలక నిబంధనలు ఉన్నాయి. అతను అర్జెంటీనా జాతీయ జట్టు లేదా, తన క్లబ్ ఇంటర్ మయామి తరపున మాత్రమే ఆడాలి. అనధికారిక మ్యాచ్లు, ఎగ్జిబిషన్ గేమ్స్, ఫ్రెండ్లీ మ్యాచ్లు బీమా పరిధిలోకి రావు. అంటే భారత్లో సరదాగా జరిగిన మ్యాచ్లో మెస్సీకి గాయమైతే బీమా వర్తించదు, పరిహారం లభించదు. ఇది అతని కెరీర్కే కాదు, బ్రాండ్ డీల్స్, క్లబ్ ఒప్పందాలకు కూడా భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ఎగ్జిబిషన్ మ్యాచ్లకు నో
ఎగ్జిబిషన్ లేదా ఫ్రెండ్లీ మ్యాచ్లలో ఆటగాళ్లకు గాయాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి మ్యాచ్లో ఒక్క చిన్న గాయం వచ్చినా, మెస్సీకి కోట్ల రూపాయల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ రిస్క్ను తీసుకోకూడదనే నిర్ణయంతోనే మెస్సీ భారత్లో మ్యాచ్లు ఆడకుండా పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే అయినా, మెస్సీ కెరీర్ను కాపాడే దృష్టితో తీసుకున్న నిర్ణయమే ఇది.








