మేఘాలయ అసెంబ్లీలో ఇటీవల చోటు చేసుకున్న ఒక అరుదైన సంఘటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే మెహతాబ్ చండీ అగిటోక్ సంగ్మా తన భర్త ముఖ్యమంత్రి కాన్రాడ్ కొంగల్ సంగ్మా ను అసెంబ్లీలో ప్రశ్నించారు. వ్యక్తిగత బంధాలను పక్కన పెట్టి, ప్రజా సమస్యలపై చర్చించడం ఈ ఘటనను ప్రత్యేకంగా నిలిపింది. మెహతాబ్ చండీ, పశుసంవర్ధక రంగంలో ఏర్పాటు కావాల్సిన విద్యాసంస్థల ప్రాజెక్టుల పురోగతి, సిబ్బంది కొరతల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2022లో కేబినెట్ ఆమోదించిన వెటర్నరీ కాలేజ్, రెండు ఫిషరీస్ కాలేజీలు, ఒక డెయిరీ కాలేజ్ ప్రాజెక్టుల పురోగతిని వివరించాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఇలా సమాధానం ఇచ్చారు. పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. సిబ్బంది కొరతను అంగీకరించి, ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం కావడంలో ఆలస్యం జరిగిందని, భూమి గుర్తింపు, అవసరమైన సిబ్బంది అంచనా వంటి అంశాలు సమయం తీసుకున్నాయని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.
అతను రి-భోయ్ జిల్లాలోని కిర్డెంకులై వద్ద వెటర్నరీ కాలేజ్ కోసం సుమారు 800 ఎకరాల భూమిని గుర్తించామని, ప్రాజెక్ట్ ఖర్చు రూ.334 కోట్లు అవుతుందని వెల్లడించారు. మొత్తం 19 విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. భారీ ఆర్థిక వ్యయం ఉన్నప్పటికీ, ప్రాజెక్టును వేగవంతం చేసే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ చర్చ అసెంబ్లీలో ఆసక్తికరంగా కొనసాగి, అధికార-విపక్ష మధ్య సున్నితమైన సమన్వయాన్ని చూపించింది.








