పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. దీనిపై స్పందించిన మల్లారెడ్డి, జిల్లాలో అభివృద్ధి పనుల గురించీ, మెడికల్ మరియు ఇంజినీరింగ్ సీట్ల విషయమై సీఎంను కలిశానని వెల్లడించారు. సీఎంను కలవడంలో తప్పేముందని ప్రశ్నిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన వారే ఇబ్బందుల్లో ఉన్నారని సెటైర్లు వేసారు.
ఎంపీగా పోటీపై క్లారిటీ
ప్రస్తుతం తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మల్లారెడ్డి, జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, తమ కుటుంబం నుంచి నలుగురు బీఆర్ఎస్ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.