తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాగా హర్ట్ అయిన నటి మాధవీలత ఆయనపై చర్యలకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లయింట్ చేసిన మాధవీలత, తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ (సీపీ)కి ఫిర్యాదు చేసింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సినిమాల్లో నటిస్తున్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసభ్యకరంగా, సభ్యసమాజం తలదించుకొనేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాధవీలత డిమాండ్ చేశారు. సినిమారంగంలో మహిళల గౌరవాన్ని పరిరక్షించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్రెడ్డి క్షమాపణ చెప్పినప్పటికీ మాధవీలత సంతృప్తి చెందలేదు. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన జేసీపై చర్యలు తీసుకోవాల్సిందేనని మాధవీలత పట్టుబట్టారు.
జేసీ ప్రభాకర్రెడ్డిపై ఫిర్యాదును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మాధవీలత చెప్పారు. తాను ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, అందుకే జేసీ క్షమాపణలు చెప్పారన్నారు. తకు బీజేపీ అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు తనకు హామీ ఇచ్చారని చెప్పారు. మహిళలను కించే పరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే వారిని వదిలిపెట్టం అని సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ చెప్పారని, ఆ మాటకు వాళ్లు కట్టుబడి ఉండాలని మాధవీలత డిమాండ్ చేశారు.