మచిలీపట్నం (Machilipatnam) కలెక్టరేట్ (Collectorate) లో న్యాయం కోసం ఓ యువతి చేసిన పని సంచలనంగా మారింది. ఇంటి స్థలం విషయంలో తనకు న్యాయం చేయాలని కృష్ణా జిల్లా తలకటూరు (Thalakaturu) కు చెందిన మహిళ (Woman) తన చెవిదిద్దులను (Earrings) అధికారుల టేబుల్ మీద పెట్టి కన్నీటి పర్యంతమైన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. సోమవారం మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయానికి యువతి భువనేశ్వరి (Bhuvaneshwari) చేరుకుంది. తలకటూరు గ్రామంలోని తన తాత స్థలాన్ని (Grandfather’s Land) 16 ఏళ్ల క్రితం బంధువులు అక్రమంగా (Illegally) అమ్మేశారని (Sold), 16 ఏళ్లుగా కోర్టులో పోరాడి కేసు గెలిచామని భువనేశ్వరి వెల్లడించింది. కోర్టులో కేసు ఉండగానే ఆ స్థలంలో జనసేన నేతలు (Jana Sena Leaders) కాట్రగడ్డ కేశవ (Katragadda Keshav), యరపతి అయ్యప్ప (Yarapati Ayyappa) ఇల్లు (house) కట్టేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. హౌస్ ట్యాక్స్ లేకపోయినా అధికారులు వాటర్ కనెక్షన్ ఇచ్చారని తెలిపింది. జనసేన నేతలు కాట్రగడ్డ కేశవ్, యరపతి అయ్యప్పకే గ్రామ పెద్దలు అండగా నిలిచారని, ఇంటి స్థలం అడిగితే తనను జనసేన నేతలు ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది.
‘నువ్వు ఆడపిల్లవు.. నీ తాత ముసలోడు.. మమ్మల్నేం చేయలేరు. మాకు ఎంపీ (MP) , ఎమ్మెల్యే(MLA) సపోర్ట్’ ఉందంటూ తనను జనసేన నేతలు బెదిరించారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. గ్రౌండ్ లెవల్ ఎండార్స్ మెంట్ (Ground Level Endorsement) ఇవ్వాలంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నానని, డబ్బులిస్తే కానీ రాజకీయ నాయకులు పనిచేయడం లేదంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద డబ్బలు లేవని, గ్రీవెన్స్ లో అధికారుల ముందు చెవి దుద్దులు ఉంచి న్యాయం చేయమని భువనేశ్వరి కోరింది. తన ఇంటి స్థలానికి అన్ని అనుమతులు ఉన్నా కూడా స్థానిక నాయకులు ఇబ్బంది పెడుతున్నారంటూ కలెక్టరేట్ లో అధికారుల ముందు తన గోడు వెళ్ళబోసుకుంది. భువనేశ్వరి చెవి దుద్దులు ఇవ్వడంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ, అది ఇంకా అమలుకాకపోవడం తనను తీవ్రంగా కలిచివేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి వారికి కూడా న్యాయం చేయలేకపోతే ఇంకా ఎందుకు ప్రభుత్వం అని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన స్థానిక అధికారులపై తీవ్ర విమర్శలను రేకెత్తిస్తోంది. కోర్టు తీర్పు అమలుకు అడ్డంకులు ఎందుకు ఏర్పడుతున్నాయి, స్థానిక నాయకుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యువతి సమస్యపై అధికారులు తక్షణం స్పందించి, న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.