రాష్ట్రంలో గతంలో అవసరమైన సందర్భాల్లోనే ముఖ్యమంత్రులు విమానయానం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ కొన్ని నెలల్లోనే పదుల సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం చేశారు. ఇక మంత్రులైతే.. తగ్గేదే లేదంటూ వాళ్లు కూడా స్పెషల్ ఫ్లైట్ లలో జర్నీలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగానే చిల్లు పెడుతున్నారు. కొందరు టీడీపీ, బీజేపీ ఎంపీలు సైతం తామేం తక్కువ తినలేదంటూ.. ప్రత్యేక ఫ్లైట్లలో ప్రయాణించడమే కాకుండా సొంతంగా ఫ్లైట్లు కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు ప్రత్యేక విమానం ఉంది. మరొకటి కొన్నారు.. వారం రోజుల్లో డెలివరీ అవుతుందని సమాచారం. కూటమిలో ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రత్యేక విమానం కోసం ఆర్డర్ ఇచ్చాడు. రూ.120 కోట్లు విలువజేసే విమానం డెలివరీకి సిద్ధంగా ఉంది.

స్పెషల్ ఫ్లైట్లలో పవన్, లోకేష్
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ నేలమీద తిరగడం మానేశారు. కాలు కదిపితే స్పెషల్ ఫ్లైటే.. లోకేష్ ఎక్కడికెళ్లినా స్పెషల్ ఫ్లైటే వాడుతున్నారు. ఇప్పటికే లింగమనేని రమేష్ కు ఉన్న స్పెషల్ ఫ్లైట్ ను పవన్ కల్యాణ్ వాడుతున్నారు. పవన్ కోసం మరో ప్రత్యేక విమానం ఉండాలని భావించి కొనేందుకు వెతుకుతున్నారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక పర్యటనలకు ఉపయోగిస్తున్న స్పెషల్ ఫ్లైట్ సౌకర్యాలకు, రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా తన ఫ్లైట్ కూడా ఉండాలని పవన్ ఆదేశించారని తెలిసింది. వీకెండ్ షికార్లలో భాగంగా ప్రతి శుక్రవారం, శనివారం లోకేష్, చంద్రబాబు, పవన్ స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ పోతారు. లోకేష్ మంత్రాలయానికి కూడా స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాడు. నిబంధనల ప్రకారం మంత్రులకు స్పెషల్ ఫ్లైట్లు ఉండవు. మరి వీరు ఏరకంగా ప్రయాణిస్తున్నారు? కొందరు ఎమ్మెల్యేల సైతం ప్రత్యేక విమానాల ప్రయాణాలు చేస్తున్నారు. ప్రజా సొమ్మును ఇలా దుబారా చేయడానికి వీరికి హక్కు ఎవరిచ్చారు?

డీజీసీఏ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మంత్రులు
డీజీసీఏ రూల్ ప్రకారం ముఖ్యమమంత్రి కోసం తప్ప మరెవరికోసం కూడా రన్ వే మీదకు కార్లు పోకూడదు. అలాంటిది పవన్ కల్యాణ్, నారా లోకేష్ కోసం రన్ వే మీదకు కార్లను అనుమతిస్తున్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయనకు ఫోన్ చేసి నిబంధనలకు విరుద్ధంగా కార్లు వెళ్లేలా చేస్తున్నారు. గన్నవరం, బేగంపేట, ఇతర విమానాశ్రయాల్లో ఇలా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా విమానయాన శాఖ నిబంధనలను ఉల్లంఘనే.

బినామీ పేరుతో స్పెషల్ ఫ్లైట్ కొనుగోలు?
ఏ రాజకీయ నేత కూడా నేరుగా స్పెషల్ ఫ్లైట్ లను తన పేరు మీద పెట్టుకోరు అనే విషయం తెలిసిందే. తన అక్రమ సంపాదన అంతా ఎక్కడైతే పార్క్ చేస్తున్నాడో అక్కడి వాళ్ళతో నే ఈ స్పెషల్ ఫ్లైట్ ను కొనుగోలు చేస్తుంటారు. కొద్ది సంవత్సరాల క్రితం ఇంచుమించు దివాళా స్థితికి చేరిన ఓ పవర్ బ్రోకర్ ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు కీలక పార్టీల అండదండలతో పెద్ద ఎత్తున సంపాదించారు అని… ఒక కీలక పార్టీ తమ అక్రమ సంపాదన మొత్తాన్ని అతడి ద్వారానే విద్యుత్ రంగంతో పాటు వివిధ ప్రాజెక్ట్ ల్లో పెట్టుబడులు పెడుతున్నారు అని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఆ మంత్రి అక్రమ సంపాదనతో పాటు తన కోసం కొనుగోలు చేసిన స్పెషల్ ఫ్లైట్ ను కూడా అక్కడే పార్క్ చేశారు అని చెపుతున్నారు. 14 సీట్ల స్పెషల్ ఫ్లైట్ కనీస ధర 150 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెప్తున్నారు. ఒక మంత్రి ఏడాది కూడా పూర్తి కాకముందే స్పెషల్ ఫ్లైట్ కొనే స్థాయికి వెళ్లిపోయారు అంటే వాళ్ళ సంపాదన ఏ రేంజ్ లో ఉందే ఊహించుకోవచ్చు అనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతోంది. అయితే ఆ మంత్రి ఇప్పుడు ఇలాంటివి నాలుగైదు కొనగలరు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.