”లం.. ముం.. చంపేస్తా..” చంద్ర‌బాబు తిట్ల దండ‌కం (Video)

లం.. ముం.. చంపేస్తా.. చంద్ర‌బాబు తిట్ల దండ‌కం (Video)

‘లం.. ముం.. చంపేస్తా.. చెప్పిన మాట విని ఆ పొలం వదిలేయండి. మిమ్మ‌ల్ని కాపాడేవాడు లేడు.. ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా’ అని ఓ పోలీస్ అధికారి మ‌హిళా రైతుపై దుర్భాష‌లాడిన ఘ‌ట‌న ఆంధ్ర‌రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. త‌న భూమి కబ్జాకు గురైంద‌ని, న్యాయం చేయాల‌ని కోరిన రైతు కుటుంబాన్ని కాపాడాల్సిన పోలీసులే రియ‌లెస్టేట్ వ్యాపారికి కొమ్ముకాస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అభం శుభం తెలియ‌ని ఆ కుటుంబంలోని మైన‌ర్ల‌పై రౌడీషీట్ ఓపెన్ చేయ‌డంపై స్థానికులు సైతం విస్తుపోతున్నారు. పోలీసుల దుర్మార్గపు చ‌ర్య‌ల‌పై ఆ మ‌హిళా రైతు క‌న్నీరు పెట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే..
క‌ర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన రైతు నాగన్న కుటుంబానికి 12.84 ఎకరాల భూమి ఉంది. ఇది కొన్ని కారణాలవల్ల నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న రియల్‌ ఎస్టేట్ వ్యాపారి కేజే రెడ్డి ఈ భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లోని భూములను బెదిరింపులతో, చౌక ధరలతో కొనుగోలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

నాగన్న కుటుంబం మాత్రం తమ భూమిని ఇచ్చేందుకు నిరాకరించడంతో, పోలీసుల సహాయంతో వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. నాగన్న కుమారులపై (9, 10 త‌ర‌గ‌తి) రౌడీ షీట్‌ ఓపెన్ చేయించడమే కాకుండా, తప్పుడు కేసులతో వేధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. న్యాయం కోసం బాధిత రైతు కుటుంబం ఎస్పీ ఆఫీస్ మెట్లు ఎక్కింది. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తారా..? అనే కోపంతో రైతు నాగ‌న్న కుటుంబాన్ని మరింతగా భయపెట్టేందుకు మంగళవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన సీఐ, నాగ‌న్న భార్య ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు.

“లం.. ముం.. చంపేస్తా నిన్ను”
“చెప్పినట్టు ఆ భూమిని వదిలేయండి, లేదంటే మీకు ప్రాణహాని తప్పదు. ఇంకా మాట్లాడితే నేనే చంపేస్తా” అంటూ నాగన్న భార్యను సీఐ చంద్రబాబు దుర్భాష‌లాడుతూ చేయి చేసుకున్నాడు. సీఐ ప‌క్క‌నున్న ఇద్ద‌రు సిబ్బంది కూడా త‌న‌పై దాడి చేశార‌ని రైతు నాగ‌న్న భార్య మీడియాకు వివ‌రించింది. సీఐ ప్ర‌వ‌ర్త‌న‌, అసభ్య పదజాలంతో మాట్లాడిన మాట‌ల‌తో బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. న్యాయం వైపు నిల‌బ‌డాల్సిన సీఐ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి త‌ర‌ఫున వ‌క‌ల్తా పుచ్చుకొని రైతు కుటుంబాన్ని వేధించడంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ప్రాణభయంతో ఊరొదిలిన కుటుంబం
న్యాయం కోసం తాము ఎస్పీ, డీఐజీలను ఆశ్రయించామని, కానీ పోలీసుల ప్రవర్తన వల్ల ఊరిలో ఉండలేక డోన్ సమీపంలోని కొచ్చెరువులో తలదాచుకున్నామని బాధితులు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని, భూమిని కాపాడేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.

మ‌హిళ‌ల ప‌ట్ల సీఐల అత్యుత్సాహం..
ఇటీవ‌ల కొంద‌రు పోలీస్ అధికారుల తీరు పోలీసు వ్య‌వ‌స్థ‌కే మాయ‌ని మ‌చ్చ‌ని తెచ్చిపెడుతోంది. ఇటీవ‌ల మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీపై చిల‌క‌లూరిపేట రూర‌ల్ సీఐ సుబ్బానాయుడు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళా నేత‌పై దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించిన పోలీస్ అధికారిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా క‌ర్నూలు రూర‌ల్ సీఐ చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. న్యాయం కోసం వెళ్లిన మ‌హిళ ప‌ట్ల అమ‌ర్యాద‌గా, బూతులు తిడుతూ వ్య‌వ‌హ‌రించిన ఇలాంటి పోలీస్ అధికారుల‌పై కోర్టులు, మాన‌వ హ‌క్కుల సంఘాలు స్పందించి సుమోటోగా కేసులు స్వీక‌రించి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వహారంపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో మ‌రి వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment