కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే సభకు భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరై బీఆర్ఎస్ శక్తి ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఓటమికి ప్రజలు కారణం కాదని, అసూయ, ద్వేషం, ఆశలే అసలు కారణమని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్ – బీఆర్ఎస్కు సెంటిమెంట్
కరీంనగర్ బీఆర్ఎస్కు చాలా బలమైన ప్రాంతమని, ఇక్కడి నుంచి ప్రారంభమైన ప్రతి ఉద్యమం విజయవంతమైందని కేటీఆర్ గుర్తుచేశారు. 2001లో జరిగిన ‘సింహగర్జన’ సభ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిందని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూసినప్పటికీ, కేసీఆర్ రాజీనామాతో జరిగిన ఉపఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్పై ఫైర్
బీజేపీ, కాంగ్రెస్లు రెండు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమేనని, మోడీ ఇచ్చిన రూ.15 లక్షల హామీ మోసమేనని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలన అంటే పోలీసు రాజ్యమేనని, రైతులు ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, ఈ పరిస్థితిని బీఆర్ఎస్ మారుస్తుందన్నారు.
బీఆర్ఎస్ పునర్నిర్మాణం..
ఏప్రిల్ 27 తర్వాత బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే వాళ్లకన్నా ప్రజల్లో పని చేసే నాయకులకు పెద్దపీట వేస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు.