గుడివాడ (Gudivada)లో రెండ్రోజుల క్రితం జరిగిన తీవ్ర ఉద్రిక్త ఘటనలో ఏపీ పోలీసుల (AP Police’s)తీరుపై వైసీపీ(YSRCP) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ(TDP) దాడి చేసి దుర్భాషలాడిన ఘటనలో బాధితులే.. నిందితులయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త (Uppala) ఉప్పాల రాము (Ramu)పై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నాగవరప్పాడు వంతెన వద్ద జరిగిన ఘటనలో తెలుగు మహిళా నేత మాదాల సునీత కారును ఢీకొట్టి, ఆమెను అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. సునీత ఫిర్యాదు మేరకు ఉప్పాల రాము, వైసీపీ నేత కందుల నాగరాజుతో పాటు ఇతర కార్యకర్తలపై సెక్షన్ 129(a), 79, r/w 3(5) BNS కింద కేసు నమోదైంది. అయితే, ఈ ఘటనలో బాధితులపైనే కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది.
ఘటన వివరాలు
జులై 12న గుడివాడలో వైసీపీ ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ అనే కార్యక్రమాన్ని లింగవరం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంది. గుడివాడలో వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, టీడీపీ ఆందోళన చేపట్టింది. నాగవరప్పాడు జంక్షన్ వద్ద టీడీపీ, జనసేన కార్యకర్తలు వైసీపీ ఫ్లెక్సీలను చించివేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి జరిగినట్లు, ఆమెను అసభ్యంగా దూషించారు. టీడీపీ, జనసేన నేతలు తనను నోటితో చెప్పరాని భాషలో దూషించారని జడ్పీ చైర్పర్సన్ హారిక కన్నీరు పెట్టుకున్నారు. దాడి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. జడ్పీ చైర్పర్సన్ కారు వద్ద టీడీపీ కార్యకర్త శివప్రసాద్ గోవాడ అనే వ్యక్తి దాడి చేసిన వీడియోలు విడుదలయ్యాయి. అయినప్పటికీ, బాధితులైన హారిక, రాముపైనే కేసు నమోదు చేశారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.
వైసీపీ నిరసన
ఉప్పాల హారిక ఫిర్యాదు మేరకు టీడీపీ, జనసేన కార్యకర్తలపై సెక్షన్ 126(2), 292, 324(4), 351(2) r/w 3(5) BNS కింద కేసు నమోదైంది. హారికను అవమానించి, కారు అద్దాలు పగలగొట్టి, చంపుతామని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, టీడీపీ మహిళా నేత సునీత ఫిర్యాదు ఆధారంగా రాము, కందుల నాగరాజుపై కేసు నమోదు కావడం వివాదానికి దారితీసింది. వైసీపీ నేతలు ఈ చర్యను రాజకీయ కక్షసాధింపుగా ఆరోపిస్తున్నారు. బాధితులే నిందితులయ్యారని, కేసులు నమోదు చేయడంలోనూ విచిత్ర, వింత ధోరణలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.







