ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని ఇళ్లలోకి దూరి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఇల్లు అద్దె పేరుతో మహిళలను నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను గురించిన గుడివాడ పోలీసులు, వారిని అరెస్ట్ చేశారు. నిందితులు మాధురి, రాజేశ్వరి, రమావతిలు కాగా, వీరు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. నిందితుల వద్ద నుంచి 71 గ్రాముల బంగారం, 327 గ్రాముల వెండి ఆభరణాలు, నాలుగు పట్టుచీరలు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల గుడివాడ లక్ష్మీనగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకునేందుకు వెళ్లింది మాధురి. కాలనీలో శేషుకుమారి అనే మహిళ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నట్లు నమ్మించిన మాధురి కొంత అడ్వాన్స్ ఇచ్చింది. తీర్ధయాత్రలకు తీసుకెళ్తామని శేషుకుమారిని నమ్మించిన మాధురి.. చిన్న తిరుపతి, షిర్డీకి తీసుకెళ్లిన తర్వాత తిరుగు ప్రయాణంలో బాధితురాలిని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసింది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం మిగిలిన ఇద్దరు మహిళలతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి బీరువాను ఆటోలో మచిలీపట్నంలోని మరో అద్దె ఇంటికి తరలించారు.
గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. మాధురి తన అమ్మమ్మ, నాయనమ్మతో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇల్లు అద్దె పేరుతో అమాయక మహిళలను నమ్మించి మోసగించే ఈ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.







