వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి రేషన్ బియ్యం కేసులో కృష్ణా జిల్లా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పేర్ని జయసుధకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. రేషన్ బియ్యం మాయం అంటూ కూటమి ప్రభుత్వం పేర్ని జయసుధపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె ఏ1గా ఉన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. కేసులో పోలీస్ విచారణకు సహకరించాలంటూ ఆదేశించింది.
ఈ కేసులో పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టూకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఇటీవల పేర్ని నాని మీడియా సమావేశంలో స్పందిస్తూ తాను, తన కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని, తన తల్లి మీద ఒట్టేసి చెబుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన తనకు ఏనాడూ లేదని స్పష్టం చేశారు. కేవలం తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని, తప్పు చేసి ఉంటే అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు వరకు ఏం చేశారని ప్రశ్నించారు.