కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP Etela Rajender) చేసిన ఆరోపణలను సమర్థించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి (Union Minister) జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy). అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former Chief Minister KCR)పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం విచారణ కమిటీ (Kaleshwaram Inquiry Committee) ఎదుట ఈటల రాజేందర్ శుక్రవారం హాజరయ్యారు. విచారణలో అనంతరం ఎంపీ ఈటల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి, అక్రమాలపై కమిషన్ ముందు వాస్తవాలను వెల్లడించారని, ఈ విషయంలో బీజేపీ ఆయనకు పూర్తి మద్దతు ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ(CBI) దర్యాప్తు జరపాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) పిల్లర్లు పగుళ్లు ఏర్పడిన విషయం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రిపోర్ట్ ద్వారా రుజువైందని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఆరోపించారు. “అప్పులు తెచ్చేందుకు కార్పొరేషన్ పెట్టారని, అవినీతి ఆరోపణలపై కేసీఆర్(KCR) బహిరంగంగా సమాధానం చెప్పాలి. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత ఉపయోగకరంగా ఉందో వివరించాలి,” అని ఆయన సవాలు విసిరారు. ఈటల రాజేందర్ కేసీఆర్ కుటుంబ పరిపాలనను ప్రశ్నించడం మొదలుపెట్టిన వెంటనే ఆయనపై భూమి వ్యవహారం ఆరోపణలు చేసి బీఆర్ఎస్(BRS) నుంచి బయటకు పంపారని, అయినప్పటికీ ఈటల ధైర్యంగా విచారణను ఎదుర్కొన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడినప్పటికీ, ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. “మా పార్టీ ఎంపీలు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా విచారణకు వెళ్లారు. కానీ, కేసీఆర్ మాత్రం అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పడం లేదు,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి, నిర్మాణ లోపాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని, ఈ విషయంలో ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవమని కిషన్ రెడ్డి సమర్థించారు.