కల్తీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వం పెద్దలే ఉన్నారు.. దమ్ముంటే సీబీఐ (CBI) తో విచారణ జరిపించండి అంటే సిట్(SIT) వేసి, అయినా మూలాలన్నీ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)వైపే తిరుగుతున్నాయని కొత్తగా చందమామ కథ ఒకటి అల్లి బయటకు వదిలారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatrami Reddy) అన్నారు. తాడేపల్లి (Tadepalli)లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
నకిలీ మద్యం (Fake Liquor) కేసుపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు (Chandrababu) చేసేది బురద చల్లుడు రాజకీయమే.. కట్టుకథలతో ఎన్టీఆర్(NTR) లాంటోడినే నాశనం చేశారు.. కస్టడిలో ఉన్న జనార్ధన్ (Janardhan) వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎవరు రికార్డు చేశారు? అని లాజిక్ ప్రశ్నలు ప్రభుత్వంపై సంధించారు. సీబీఐ విచారణ కోరితే సిట్తో తాత్సారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. “సీబీఐ వస్తే బండారం మొత్తం బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగేస్తోందా?” అని కేతిరెడ్డి నిలదీశారు.
కేతిరెడ్డి మాట్లాడుతూ.. “ఎక్సైజ్ అధికారులు రెండున్నర నెలల నుండి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు అంగీకరించారు. కానీ, టీడీపీ మాత్రం రెండు మూడేళ్లుగా తయారవుతోందని అబద్ధాలు చెబుతోంది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దొరికిన వెంటనే జోగి రమేష్ వెళ్లి మాట్లాడినందుకే అతనిపై కక్ష కట్టి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద మా వాళ్లు ఒక్క ఫ్లెక్సీ కట్టినా కేసులు పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మా నేతలు నకిలీ మద్యం వ్యాపారం చేస్తారన్న ఆరోపణలు హాస్యాస్పదం” అన్నారు.
తన ప్రసంగంలో కేతిరెడ్డి మరోసారి సీబీఐ విచారణకే డిమాండ్ చేశారు. “నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. కస్టడీలో ఉన్న జనార్ధన్ వీడియో ఎలా బయటకు వచ్చింది? సిట్ విచారణ చేస్తుందా, లేక వీడియోలు లీక్ చేస్తుందా?” అని ప్రశ్నించారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలపై జరుగుతున్న వేధింపులు కూటమి కక్షసాధింపే అని అన్నారు. “ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఒత్తిడి తెచ్చినా మేము ఎదుర్కొంటాం. ప్రజలే తీర్పు చెబుతారు,” అని కేతిరెడ్డి స్పష్టం చేశారు.








