ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Elections) ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ను ఓడించి సంచలన విజయం సాధించారు. 3 వేల ఓట్ల తేడాతో ఆప్ కన్వీనర్ పరాజయం చెందినట్లుగా తెలుస్తోంది.
ఫిబ్రవరి 5 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమవ్వగా, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు (Delhi Election Results) నుంచి బీజేపీ హవా కొనసాగుతోంది. నాలుగోసారి విజయం సాధిస్తారని భావించిన కేజ్రీవాల్, వరుసగా మూడు విజయాల తర్వాత ఓటమి చెందడం రాజకీయంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి ఆరోపణలు, అలాగే ఆయన క్లీన్ ఇమేజ్ దెబ్బతినడం ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.