కర్నూలు (Kurnool) జిల్లాలో టీడీపీ (TDP) సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి (K.E.Krishnamurthy) తమ్ముడు కేఈ ప్రభాకర్ (K.E.Prabhakar) గన్తో హల్చల్ సృష్టించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ (Manikonda)లో గన్తో కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అద్దెకు ఇచ్చిన ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని కేఈ ప్రభాకర్ బెదిరించారు. అగ్రిమెంట్ ఉందని అద్దెకున్నవారు అడగ్గా కేఈ ప్రభాకర్ క్షణికావేశంతో ఊగిపోయారని సమాచారం. అగ్రిమెంట్ గడువు ఇంకా ఉండగా కూడా ఆయన దౌర్జన్యానికి దిగారని బాధితులు ఆరోపించారు.
10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో కేఈ ప్రభాకర్ గన్తో కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. దీంతో భయబ్రాంతులకు గురైన ఇంట్లో అద్దెకు ఉన్నవారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
టీడీపీ సీనియర్ నేత కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ రకమైన వ్యవహారంలో నిందితుడిగా మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజకీయ ప్రభావంతో కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, వాస్తవాలు బయటపెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.








