తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో మాజీ సీఎంలు

తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో మాజీ సీఎంలు

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్య‌మంత్రి ట్రెండింగ్‌లో ఉన్నారు. సోష‌ల్ మీడియా మొత్తం కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్ ఫొటోలు, వీడియోలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్‌, వైసీపీలకు జ‌నంలో ఉన్న ఆద‌ర‌ణ ఏపాటిదో ఇవాల్టి కార్యక్ర‌మాల వీడియోలు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయా పార్టీల అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విప‌రీతంగా కామెంట్లు పెడుతున్నారు. ట్రెండింగ్‌లో ఉన్న ఇద్ద‌రు మాజీ సీఎంలు మంచి మిత్రుల‌నే ముద్ర‌ ఉండ‌డం గ‌మ‌నార్హం.

విచార‌ణ‌కు హాజ‌రైన కేసీఆర్‌..
కాళేశ్వ‌రం ప్రాజెక్టు విచార‌ణ‌లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ బీఆర్కే భ‌వ‌న్‌లో జ‌స్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని క‌మిష‌న్ ఎదుట హాజ‌ర‌య్యారు. అంత‌కు ముందు ఎర్ర‌వెల్లిలోని ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బీఆర్కే భ‌వ‌న్ వ‌ద్ద‌కు బ‌య‌ల్దేరారు. ఫామ్ హౌస్ నుంచి విచార‌ణ క‌మిష‌న్ ఎదుట హాజ‌ర‌య్యేంత వ‌ర‌కు దారి పొడ‌వునా బీఆర్ఎస్ శ్రేణులు దండుక‌ట్టారు. సుమారు 50 నిమిషాల పాటు కేసీఆర్‌ను విచార‌ణ కమిషన్ ప్ర‌శ్నించింది. విచార‌ణ ముగిసేంత వ‌ర‌కు ఓపిగ్గా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు.. కేసీఆర్ తిరుగు ప్ర‌యాణం కాగానే ఆయ‌న వెంట వేలాది మంది ర్యాలీగా సాగారు.

పొదిలిలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌
ధ‌ర‌లు లేక పొగాకు పంట‌ల‌ను అమ్ముకోలేక అవ‌స్థ‌లు ప‌డుతున్న రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇవాళ పొదిలిలో ప‌ర్య‌టించారు. పొదిలి పొగాకు బోర్డు వ‌ద్ద రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అంత‌కు ముందు తాడేప‌ల్లి నుంచి పొదిలి చేరుకున్న జ‌గ‌న్ కోసం వైసీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు, రైతులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. జ‌గ‌న్ హెలిప్యాడ్ నుంచి పొదిలి పొగాకు బోర్డు వ‌ద్ద‌కు చేరుకునే ర‌హ‌దారంతా జ‌నంతో నిండిపోయింది.

సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రు మాజీలు ట్రెండింగ్‌..
కేసీఆర్ విచార‌ణ‌కు హాజ‌రైన విజువ‌ల్స్‌, ప్ర‌కాశం జిల్లా పొదిలిలో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇరు పార్టీల అభిమానులు త‌మ అభిమాన నేత‌ల ఫొటోలు, వీడియోల‌ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు కాబ‌ట్టి.. బీఆర్కే భ‌వ‌న్ వ‌ద్ద కేసీఆర్ ఫ్లెక్సీలు పెద్ద‌గా లేక‌పోయిన‌ప్ప‌టికీ, పొదిలిలో జ‌గ‌న్ బ్యాన‌ర్లు భారీగా ద‌ర్శ‌నిమిచ్చాయి. వ‌చ్చేది మ‌న‌మే చూసుకుందాం.. జ‌గ‌న‌న్న 2.0 లోడింగ్ వంటి స్లోగ‌న్స్‌తో బ్యాన‌ర్స్ క‌నిపించాయి. తెలంగాణ‌లో కేసీఆర్ విచార‌ణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ పొదిలి ప‌ర్య‌ట‌న ఈ రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపాయంటున్నారు ఆయా పార్టీల నేత‌లు.

Join WhatsApp

Join Now

Leave a Comment