కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది భారతీయులు దుర్మరణం చెందారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్పై భారతదేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఉగ్రవాదులకు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోడీ.. మన్ కీ బాత్తో సంచలన వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రాంతాన్ని నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కశ్మీర్లో అభివృద్ధి వేగం పెరిగిందని, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందిందన్నారు. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారన్నారు మోడీ. ఈ దాడి ఘటనన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందని, ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోందని చెప్పారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ప్రపంచ మద్దతు కూడా లభిస్తుందన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఈ దాడికి పాల్పడినవారికి, సూత్రధారులకు కఠినమైన, వారి ఊహించని శిక్ష వేస్తామని మన్ కీ బాత్తో మరోసారి ప్రకటించారు. భారత్లోని ఉగ్రమూకలు చేసిన దాడికి ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారని చెప్పారు. ఉగ్రదాడిని ప్రపంచ నాయకులు గట్టిగా ఖండించారన్నారు.
దేశ పౌరులంతా సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరమన్నారు. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయని, ఈ సందర్భంలో దేశం ఐకమత్యమే విజయానికి ఆధారన్నారు. పహల్గామ్లో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపుతుందన్నారు. 22 ఏప్రిల్ పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి భారతీయుడి మనసును కలచివేసిందని, ఉగ్రదాడి దృశ్యాలను చూసి ప్రతి భారతీయుడి గుండె రగులుతోందని మోడీ అన్నారు.