బేకరీ, స్వీట్స్ పరిశ్రమల్లో ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బ్రాండ్లలో కరాచీ బేకరీ (Karachi Bakery)ఒకటి. “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) అనంతరం దేశవ్యాప్తంగా ఉద్భవించిన జాతీయ భావంతో హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ బేకరీ సంస్థ ‘కరాచీ బేకరీ’ మరోసారి విమర్శలకు కేంద్రంగా మారింది. కరాచీ పాకిస్తాన్కు (Pakistan) చెందిన సంస్థ అని, వెంటనే ఈ బేకరీలను బహిష్కరించాలని డిమాండ్లు తీవ్రమయ్యాయి. దేశ విభజన అనంతరం 1953లో ఒక శరణార్థి స్థాపించిన ఈ 70 ఏళ్ల బ్రాండ్ ప్రస్తుతం వారసత్వం, గుర్తింపు, వినియోగదారుల జాతీయత భావోద్వేగాల మధ్య సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.
సరిహద్దులో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో కరాచీ పేరుపై భారతీయుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ (Hyderabad), విశాఖపట్నంలోని (Visakhapatnam) అనేక అవుట్లెట్ల వద్ద నిరసనలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధానిగా ఉన్న కరాచీ పేరు ఇండియాలో కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం “ఆపరేషన్ సిందూర్” తర్వాత తలెత్తింది. దీంతో కరాచీ బేకరీ తన భారతీయ గుర్తింపును మళ్లీ రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. “కరాచీ 100% భారతీయ బ్రాండ్, 1953లో హైదరాబాద్లో ఇది స్థాపించబడింది” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పేరుకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు లేవని, వ్యవస్థాపకుడి మూలాలకూ, వ్యక్తిగత చరిత్రకూ గౌరవంగా ఉంచారని మాత్రమే కొనసాగిస్తున్నట్లు యాజమాన్యం వివరణ ఇచ్చింది.
విభజన అనంతర భారత్లో..
1947 భారత విభజన సమయంలో కరాచీ నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన సింధీ పారిశ్రామికవేత్త ఖాంచంద్ రామ్నానీ 1953లో కరాచీ బేకరీని స్థాపించారు. తన మొదటి బేకరీని కరాచీలో వదిలి రావలసి వచ్చిన రామ్నానీ, తన వారసత్వాన్ని నిలుపుకునేందుకు తన కొత్త బేకరీకి “కరాచీ” అనే పేరు పెట్టారు. ఈ బేకరీ మోజమ్ జాహీ మార్కెట్లో చిన్న అవుట్లెట్గా ప్రారంభించారు. ఈ బేకరీ ప్రత్యేకంగా ఫ్రూట్ బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్ల కోసం పెద్ద ఎత్తున కస్టమర్ల ఆదరణ పొందింది. ఈ ఉత్పత్తులు కరాచీ బ్రాండ్ ప్రతిష్టతను పెంచాయి. ఈ రోజుకీ అత్యధికంగా అమ్ముడయ్యే పదార్థాలివే కావడం విశేషం. ఫ్రూట్ బిస్కెట్లు మాత్రమే కాకుండా, ఉస్మానియా మరియు జీడిపప్పు బిస్కెట్లతో కలిపి, మొత్తం అమ్మకాలలో దాదాపు 40% వాటా కలిగి ఉన్నాయి.
వ్యాపార వృద్ధి, విస్తరణ
చిన్నపాటి బేకరీగా ప్రారంభమైన ఈ కరాచీ.. ఇటీవలి సంవత్సరాల్లో దీని విస్తరణ గణనీయంగా పెరిగింది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత, రెండవ ఔట్లెట్ 2007లో హైదరాబాద్లో బంజారాహిల్స్లో ప్రారంభించారు. తొలుత 2008లో హైదరాబాద్ విమానాశ్రయంలో మూడవ అవుట్లెట్ తెరిచారు. 2025 నాటికి, ఈ కంపెనీ భారత్లోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గుర్గావ్ వంటి ప్రధాన నగరాల్లో 36 కంటే ఎక్కువ అవుట్లెట్లను నడుపుతోంది. 20కి పైగా దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది, హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఉండగానే అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకుంది. వినియోగదారుల అభిరుచుల మార్పులకు అనుగుణంగా కరాచీ బేకరీ తన కార్యకలాపాలను విస్తరించింది. 2020లో ఇది “ది హౌస్ ఆఫ్ కరాచీ బేకరీ” అనే హైఎండ్ రెస్టారెంట్ను ప్రారంభించింది, ఇందులో యూరోపియన్, ఆసియన్ వంటకాలతోపాటు సంప్రదాయ బేకరీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అలాగే కంపెనీ ‘కరాచీ కేఫే’ అనే కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేసి.. ఫాస్ట్ఫుడ్ను సాధారణ డైనింగ్ ఫార్మాట్లో అందిస్తోంది.

ఆర్థిక ఫలితాలు, మార్కెట్ స్థానం
2024 మార్చి 31 నాటికి ట్రాక్సన్ గణాంకాల ప్రకారం, కరాచీ బేకరీ వార్షిక ఆదాయం రూ.42.3 కోట్లు. 2024 జూలై 31 నాటికి 105 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ సంస్థ ఎటువంటి బయటి పెట్టుబడులు లేకుండా, వాణిజ్య పెట్టుబడి లేకుండా స్వయంగా అభివృద్ధిని సాధించింది. బయటి పెట్టుబడులతో వేగంగా విస్తరించిన థియోబ్రోమా, ది బేకర్స్ డజన్ వంటి కంపెనీల మధ్య పోటీ తటస్థంలో పనిచేస్తున్నప్పటికీ, ఈ కరాచీ బేకరీ భారత బేకరీ రంగంలో 58 కంపెనీల్లో 9వ స్థానంలో ఉంది. కరాచీ బేకరీ ర్యాంక్ బ్రాండ్ నమ్మకానికి హైలైట్గా నిలుస్తోంది.

విమర్శలలో బ్రాండ్
కరాచీ బేకరీ ప్రారంభం, ఆదరణ భారతదేశం అందులో హైదరాబాద్ వంటి నగరం నుంచి మొదలైనట్లు స్పష్టమైనప్పటికీ, దాని పేరు తరచూ వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ముఖ్యంగా భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో 2019, 2025లో నిరసనకారులు ఈ బేకరీ దేశభక్తి లేదని ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో కొన్ని చోట్ల “కరాచీ” అనే పదాన్ని పరదాలతో దాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరాచీ బేకరీ సంస్థ ఎప్పటికప్పుడు తనది భారతీయ సంస్థే అని నిరూపించుకోవాల్సి వస్తుండడం గమనార్హం. “కరాచీ పేరు సంస్థ చరిత్రలో భాగం” అని చెబుతూ, తన కార్యకలాపాలు పూర్తిగా భారతీయవేనని హైలైట్ నొక్కి మరీ చెప్పుకుంటోంది. తన వారసత్వం, నాణ్యత, భారతీయ ఆహార పరిశ్రమలో తన పాత్రను గుర్తించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రజాభిప్రాయం ఈ బేకరీ పనితీరుపై ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాల్సిన విషయమే. కానీ చారిత్రక మూలాలున్న భారతీయ బ్రాండ్గా దీని వారసత్వం స్థిరంగా ఉంది.