నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాగా, వీరికి పది రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది 6వ ఏజేఎంఎఫ్సీ కోర్టు. ఈనెల 13వ తేదీ వరకు రిమాండ్ కొనసాగనున్నట్లు కోర్టు ఉత్తర్వులిచ్చింది.
రిమాండ్ రిపోర్ట్లో సిట్ చేసిన వాదనలపై వివాదం చెలరేగింది. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు కట్టుకథ ఆధారంగా సిట్ రిపోర్ట్ సమర్పించిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. జోగి రమేష్కి వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్నీ చూపించలేకపోయిన సిట్, అబద్ధపు వాంగ్మూలాలతో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనార్ధన్రావు ఇచ్చిన వాంగ్మూలంలో జోగి రమేష్కు సంబంధించిన ఎలాంటి లావాదేవీని నిరూపించలేకపోయినట్టు సమాచారం.
అయినప్పటికీ, ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ను ఏ-18, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 నిందితులుగా పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు నకిలీ మద్యం వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నాయకుడు జయచంద్ర రెడ్డిపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శ్రీనివాస వైన్స్ యజమాని మహంకాళి పూర్ణచంద్రరావు నకిలీ మద్యం విక్రయాల్లో పాల్గొన్నప్పటికీ, ఆయనపై కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ అరెస్టుల విషయంలో చూపుతున్న ఉత్సాహం, కేసు దర్యాప్తులో కనిపించకపోవడం అధికారుల ద్వంద్వ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.








