తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఐదు నెలలుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, గతంలో అనంతపురం జిల్లా ఎస్పీ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతో పాటు అప్పటి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదులు చేసిన ఐదు నెలలైనా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం బాధాకరమని ఆయన వాపోయారు.
న్యాయం కోసం పోరాటం
తనకు న్యాయం జరగకపోతే హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లతానని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. న్యాయం కోసం విశ్రమించేది లేదు అంటూ వ్యాఖ్యానించారు.
జేసీ ఫ్యామిలీపై కేసులు..
జేసీ ప్రభాకర్ రెడ్డి, గత వైసీపీ ప్రభుత్వంలో తన కుటుంబంపై పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసులను కక్షపూరితంగా పెట్టారని ఆరోపించారు. గతంలో ఈ కేసుల కారణంగా ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయిన ఘటనలు కూడా ఉన్నాయి.