ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) అధికార కూటమి పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. జనసేన (Jana Sena) ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల పెత్తనం పెరిగిపోతోందని, తమకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కడం లేదని జనసేన ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలో జరిగిన జనసేన ఎల్పీ సమావేశంలో (Jana Sena LP meeting) ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.
మాకు అన్యాయం జరుగుతోంది – ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetty Srinivas) ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) ఉన్న చోట జనసేనకు రావాల్సిన గుర్తింపు, న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా సిఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ, నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనుల్లో జనసేన కేడర్ (Jana Sena Cadre)ను విస్మరిస్తున్నారు” అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమావేశంలోని ప్రధానాంశాలు
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తాము టీడీపీ (TDP) నేతలకు పూర్తి గౌరవం ఇస్తున్నామని, కానీ, రివర్స్లో తమకు ఆ స్థాయిలో గుర్తింపు లభించడం లేదని ఎమ్మెల్యేలు వాపోయారు. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), లోకేష్ (Lokesh) వంటి అగ్రనేతలు సహకరిస్తున్నా.. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోని టీడీపీ నేతలు తమను పట్టించుకోవడం లేదని పవన్కు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యేలు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యలను ఇలాగే వదిలేస్తే కూటమిలో కచ్చితంగా గ్యాప్ పెరుగుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. అధికారంలో భాగస్వాములుగా ఉన్నా, సొంత నియోజకవర్గాల్లోనే గుర్తింపు కోసం పోరాడాల్సి రావడంపై జనసేన ఎమ్మెల్యేల్లో నెలకొన్న ఈ అసహనం.. కూటమిలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.







