మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో సాగుతున్న దుష్ప్రచారాన్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించింది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఈ ప్రచారాల వెనుక ఉన్న శక్తులపై నిప్పులు చెరిగారు. చిరంజీవి లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిపై బురద చల్లడం మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఆ ప్రచారాల వెనుక ఏ పార్టీ ఉందో మాకు తెలుసు!
చిరంజీవిపై కావాలనే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ వ్యక్తుల వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో తమకు పూర్తి అవగాహన ఉందని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. “సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా చిరంజీవి అంటే పడని వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారు. కానీ జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.

పొత్తు ధర్మం కోసమే మౌనంగా ఉన్నాం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ తాము సహనంతో ఉన్నామని, దీన్ని చేతకానితనంగా భావించవద్దని ఆయన హెచ్చరించారు. “పొత్తులో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నాం. మమ్మల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దు. ఒకవేళ హద్దులు దాటితే తిప్పికొట్టడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారు” అని ఘాటుగా స్పందించారు. “గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు మేమంతా రోడ్లమీదకు వచ్చి పోరాటం చేశాం. అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్లంతా ఏమయ్యారు? అధికారం కోల్పోయినప్పుడు మీలాగా మేము ఇంట్లో దాక్కోలేదు. ప్రజల కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో ఉన్నాం” అని గుర్తు చేశారు. చిరంజీవి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే సహించే ప్రసక్తి లేదని, ప్రతిపక్షాలకు లేదా సొంత పార్టీలోని ప్రత్యర్థులకు ఇది హెచ్చరిక అని ఆయన తేల్చి చెప్పారు.









