దేశీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. కల్యాణి వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు బౌలర్లు అద్భుత ప్రదర్శనతో బెంగాల్ క్రికెట్ జట్టు పై పూర్తి ఆధిపత్యం సాధించారు. తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ 328 పరుగులు చేయగా, సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులతో శతకం సాధించాడు.
జమ్మూ కాశ్మీర్ తరఫున అక్విబ్ నబీ ఐదు వికెట్లు తీసి బెంగాల్ను కట్టడి చేశాడు. అనంతరం జమ్మూ కాశ్మీర్ 302 పరుగులు చేసి 26 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్కు వెళ్లింది. ఈ ఇన్నింగ్స్లో అబ్దుల్ సమద్ 82 పరుగులతో మెరిసాడు.
రెండో ఇన్నింగ్స్లో బెంగాల్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. జమ్మూ కాశ్మీర్ బౌలర్ల దాడికి 99 పరుగులకే ఆలౌట్ అయి, ప్రత్యర్థికి 126 పరుగుల లక్ష్యం ఇచ్చింది. అక్విబ్ నబీ, సునీల్ కుమార్ చెరో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ను తమ వైపు తిప్పారు. లక్ష్య ఛేదనలో జమ్మూ కాశ్మీర్ మూడో రోజు ముగిసే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 83 పరుగులు మాత్రమే అవసరం. ఈ మ్యాచ్ను గెలిస్తే జమ్మూ కాశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోనుంది.








