అసెంబ్లీ లాబీల్లో సాగిన చిట్చాట్లో వైసీపీ నుంచి జనసేనలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ జై మంగళ వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్సీ పదవి పొందిన జై మంగళ వెంకటరమణ, తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
“నా దేవుడు ఎప్పటికీ జగన్ మోహన్ రెడ్డే. ఉదయం నిద్రలేవగానే జగన్ ఫోటోకు దండం పెట్టుకుంటాను. ఈ మాట నేను ఇంటర్వ్యూల్లో కూడా స్పష్టంగా చెప్పాను” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో జగన్ మోహన్ రెడ్డి పాత్రను ఆయన భావోద్వేగంగా వివరించారు.
“20 ఏళ్లు ఊడిగం చేసినా ఎవరూ గుర్తించలేదు”
తాను రాజకీయాల్లో 20 ఏళ్లుగా సేవ చేసినా అప్పటివరకు ఎవ్వరూ తనను పట్టించుకోలేదని జై మంగళ వెంకటరమణ పేర్కొన్నారు. “పిలిచి పిల్లని ఇచ్చినట్టు పిలిచి పదవి ఇచ్చిన వ్యక్తి జగన్. అప్పుల్లో కూరుకుపోయిన నన్ను ఆయన నిలబెట్టాడు” అంటూ జగన్పై తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తాను శకుని పాత్ర పోషించానని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో తనకు కాకుండా కామినేనికి సీటు ఇచ్చారని, తాను పోటీ చేసి ఉంటే అప్పుడే మంత్రి అయ్యేవాడినని జై మంగళ వెంకటరమణ పేర్కొన్నారు. “జిల్లాలో కొలు రవీంద్ర కంటే నేను సీనియర్ని” అంటూ అప్పటి రాజకీయ పరిణామాలపై తన అసంతృప్తిని వెల్లడించారు.
జనసేనలో చేరిక, వైసీపీ ఆగ్రహం
అయితే ప్రభుత్వం మారిన వెంటనే జై మంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరడం అప్పట్లో వైసీపీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. తనను గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైఎస్ జగన్కు ద్రోహం చేశారని వైసీపీ నేతలు అప్పట్లో బహిరంగంగా విమర్శించారు.
“మళ్లీ జగన్ ప్రభుత్వమే” అన్న సంకేతాలా?
ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, జనసేన నేతగా ఉన్న జై మంగళ వెంకటరమణ “నా దేవుడు జగన్” అంటూ మాట్లాడటం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. ఆయన వ్యాఖ్యలను బట్టి రాబోయే కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు జనసేన, వైసీపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయా? లేదా అంతర్గత అసంతృప్తికి ప్రతిబింబమా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.








