వైసీపీ (YSRCP) పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (Political Advisory Committee) సమావేశం (Meeting) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్, రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొన్నదని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీలోని కీలక నేతలను అరెస్టు చేస్తున్నారని, అదే సంప్రదాయం కొనసాగితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ(TDP)లో ఎవ్వరూ బయట ఉండరని హెచ్చరించారు. తమ పార్టీలోని సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మిథున్రెడ్డి అరెస్ట్ బాధాకరం
పీఏసీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎంపీ మిథున్రెడ్డిపై కేసులు పూర్తిగా తప్పుడు ఉద్దేశంతో పెట్టారని తెలిపారు. మిథున్, గౌతం రెడ్డిలు తనను చూసి రాజకీయాల్లోకి వచ్చారని, వారితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఎక్సైజ్ శాఖను కూడా చూడలేదని గుర్తు చేస్తూ, మిథున్కు రాష్ట్ర పాలనకు సంబంధం లేకపోయినా వేధింపుల కోసం కేసు పెట్టారని జగన్ మండిపడ్డారు. అలాగే చంద్రబాబు చరిత్రను ప్రస్తావిస్తూ, ఆయన చంద్రగిరిలో 17 ఓట్లతో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ కాళ్లు, గడ్డం పట్టుకుని తిరిగి టీడీపీలో చేరాడని గుర్తుచేశారు. చంద్రగిరి నుంచి బీసీల నియోజకవర్గం అయిన కుప్పానికి చంద్రబాబు పారిపోయాడన్నారు. చంద్రబాబుకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కంట్లో నలుసులా మారాడని భాస్కర్ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడన్నారు.
నందిగం, కాకాణి అయిపోయింది.. ఇప్పుడు అనిల్పై
నందిగం సురేష్, కాకాణి గోవర్ధన్, అనిల్కుమార్ తదితర నేతలపై నమోదైన కేసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల తరఫున గళం వినిపిస్తున్నందుకే నందిగం సురేష్ను 191 రోజులు జైల్లో పెట్టారని, టోల్ గేట్ విషయంలోనూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. మాజీ మంత్రి అనిల్కుమార్పై కూడా తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా కేసు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని, దీనికోసం మేజిస్ట్రేట్ వద్ద ఫోర్స్ చేసి వాంగ్మూలం చెప్పిస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా పార్టీలో చురుకుగా ఉన్న నాయకుల గళాన్ని గల్లంతు చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనగా జగన్ వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెడుతూ టీడీపీ ప్రభుత్వం అణచివేత రాజకీయం చేస్తోందని, ప్రజాస్వామ్యంలో అసహనాన్ని చాటే ఈ తీరుపై ప్రజలు తొందరలోనే తిరగబడతారని కూటమిని హెచ్చరించారు.