మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) హైదరాబాద్ పర్యటన (Hyderabad Visit) ఏపీ (Andhra Pradesh)లో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. తాడేపల్లి నుంచి బయల్దేరి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న వెంటనే ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ (Airport) నుంచి నాంపల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court) వరకు, అక్కడి నుంచి లోటస్ పాండ్ నివాసం (Lotus Pond Residence) వరకూ భారీ ర్యాలీలు సాగాయి. అభిమానులు భారీ సంఖ్యలో హాజరవ్వడం వైసీపీ (YSRCP) శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, ఈ దృశ్యాలు అధికార టీడీపీ(TDP)లో ఆగ్రహాన్ని రేపాయి.
జగన్ హైదరాబాద్ వ్యవహరించిన తీరు “జుగుప్సాకరంగా” ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన నాయకుడు ఇలా బలప్రదర్శన చేయడం ఏంటని, జగన్ కోర్టుకు వస్తున్నట్లు కాకుండా అత్తవారింటికి వచ్చినట్లుగా ప్రవర్తించారు అని ఆరోపణలు గుప్పించారు. కార్యకర్తలు ప్రదర్శించిన “రప్పా రప్పా” ప్లకార్డుల గురించి టీడీపీ ప్రశ్నిస్తోంది.
మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇదే తీరులో స్పందిస్తూ, కోర్టుకు వెళ్లే సమయంలో ర్యాలీలు నిర్వహించడం న్యాయస్థానాలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. ఇదంతా పూర్తిగా రాజకీయ ప్రదర్శన మాత్రమేనని, ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని టీడీపీ వైపు నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, టీడీపీ విమర్శలను వైసీపీ నేతలు ఘాటుగా తిప్పికొడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్, విడుదల సమయంలో టీడీపీ శ్రేణులు తరలిరావడం కూడా బలప్రదర్శనేనా అని ప్రశ్నిస్తోంది. ఐదేళ్ల తర్వాత జగన్ హైదరాబాద్కు వస్తున్నారని తెలిసి అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావడం సహజమని, దీనిని కూడా రాజకీయ ఆరోపణలుగా మలచడం టీడీపీ కడుపుమంటకు నిదర్శనమని వైసీపీ మండిపడుతోంది. జగన్ పర్యటన విజయం టీడీపీకి జీర్ణించకపోవడంతోనే ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. జగన్కు ప్రజాదరణ లేదని, ఆయన వెంట జనం లేరని మాట్లాడేవారు.. ఆ జనాన్ని చూసి భయపడుతున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు.








