కూటమి పాలనలో ప్రజలు పడుతున్న సమస్యలపై పోరాటానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. తాను నిత్యం జనంలో ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు, కరెంట్ చార్జీల భారాన్ని పెంచడం వంటి అంశాలపై ఆందోళనలకు వైసీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
రేపు అన్ని జిల్లాల్లో..
జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులంతా శుక్రవారం (డిసెంబర్ 13న) అన్ని జిల్లాల్లో రైతు సమస్యలపై ర్యాలీలు నిర్వహించడంతో పాటు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. ముఖ్యంగా రైతులకు రూ.20,000 పెట్టుబడి సాయం, మద్దతు ధరల పునరుద్ధరణ, ఉచిత పంట బీమా పథకం అమలు వంటి డిమాండ్లతో వైసీపీ ఈ ఆందోళన చేపట్టనుంది.
వరుస ఆందోళనలు..
అదే విధంగా ఈనెల 27 కరెంట్ చార్జీల భారంపై ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల ఎదుట ప్రజలతో కలిసి వైసీపీ ఆందోళన చేపట్టనుంది. అంతేకాకుండా జనవరి 3వ తేదీ విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు, అమ్మ ఒడి నిధుల విడుదల కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనుంది. వైసీపీ ప్రతి సమస్యపై స్పష్టమైన లక్ష్యాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వ దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంపై జగన్ వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల్లోనే ఉండాలని జగన్ నిర్ణయించారు.