గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపులు వంటి అభియోగాలు కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. వంశీని ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కాగా, వంశీని జూ.ఎన్టీఆర్ పరామర్శించనున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వల్లభనేని వంశీ సినిమా నిర్మాత అనే విషయం ప్రస్తుత జనరేషన్లో చాలా తక్కువ మందికి తెలుసు. ఆయనకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ పేరుంది. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, జూ.ఎన్టీఆర్ మంచి స్నేహితులు. వీరి ముగ్గురు ఓ సినిమా షూటింగ్లో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా నెట్లో దర్శనమిస్తాయి.

జూ.ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించి సూపర్ హిట్ సాధించిన అదుర్స్ సినిమాకు వల్లభనేని వంశీమోహన్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా, మిత్రుడి కోసం విజయవాడకు జూ.ఎన్టీఆర్ రానున్నట్లుగా తెలుస్తోంది. వంశీని కూటమి ప్రభుత్వం జైలుకు పంపించింది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ వచ్చి పరామర్శిస్తే సీఎం చంద్రబాబుకు అది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ దూరం జరిగారు. అటు నారా, నందుమూరి ఫ్యామిలీతోనూ అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు.

జూ.ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించాలని యంగ్ టైగర్ ఫ్యాన్స్ అప్పట్లో పలు సందర్భాల్లో చేసిన డిమాండ్ టీడీపీలో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు పార్టీలో నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తుందని అప్పట్లో పలువురు సీనియర్ల గుసగుసలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.