శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చేపట్టిన GSLV-F15 రాకెట్ ప్రయోగం (Satellite Launch) విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీని బరువు 2,250 కిలోలు ఉంటుంది. ఈ ఉపగ్రహం భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఉపయోగపడనుంది. అలాగే, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, విమానాల నిఘా, రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు కీలకంగా మారనుంది.
ఇది ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం కావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో మైలురాయిగా నిలిచిన ఈ విజయంతో, భవిష్యత్తులో మరిన్ని ఆధునిక ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం కావడంతో దేశ ప్రముఖులు నుంచి ఈ ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలు మరియు సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.