భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి వెళ్లిన రాకెట్ రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్నాథ్ ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. భారత దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించాలంటే, వ్యోమ నౌకల డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
జనవరి 7న డాకింగ్?
ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ సోమ్నాథ్ ఈ ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను అభినందించారు. స్పేడెక్స్ శాటిలైట్లు కక్ష్యలో ప్రవేశపెట్టడం ఈ ప్రయోగంలో తొలి భాగం కాగా, డాకింగ్ ప్రక్రియ మరో వారం రోజులలో, జనవరి 7న జరగవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రయోగం భారతదేశం కోసం మరింత విజయవంతమైన ప్రయోగాలను మరియు అంతరిక్ష టెక్నాలజీ లో ప్రపంచ స్థాయిలో ఎదుగుదలకే దారితీయగలదు.