కూటమి (Coalition) అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఏపీ (Andhra Pradesh)లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యర్థి పార్టీ టార్గెట్గా సాగుతున్న అరెస్టుల పర్వం తాజాగా జర్నలిస్టులను (Journalists) తాకింది. వైసీపీ కార్యకర్తల నుంచి మాజీ మంత్రుల (YSRCP Workers To Former Ministers) వరకు అరెస్టు (Arrested) అయిన బాధితుల జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. పల్నాడు, అనంతపురం (Palnadu, Anantapur) వంటి ప్రాంతాల్లో వైసీపీ సానుభూతిపరులు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోయిన సంఘటనలు తెలిసిందే. వినుకొండ (Vinukonda)లో నడిరోడ్డుపై రషీద్ (Rasheed) హత్య (Murder), లోకేశ్ బ్యానర్ ముందు వైసీపీ నేతను మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించడం వంటి ఘటనలు నేటికీ సామాజిక మాధ్యమాల్లో కంటపడుతూనే ఉన్నాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ (YS Jagan) ఈ దాడులపై స్పందిస్తూ, రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” (Red Book Constitution) నడుస్తోందని, ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, రాష్ట్రంలో శాంతిభద్రతల లోపాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వందలాది మందిని రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి జైళ్లలో బంధించారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. వైసీపీ నాయకులైన వల్లభనేని వంశీ, నందిగం సురేష్, పిన్నెల్లి, పేర్ని నాని, కాకాణి, ఆ పార్టీ సానుభూతిపరుడు పోసాని వంటి వారిపై పాత కేసులను తిరిగి తెరమీదకు తెచ్చి, కొత్త ఆరోపణలను జోడిస్తూ కేసులు నమోదు చేసి జైళ్లకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వంశీ, పిన్నెల్లి సోదరులు, కాకాణి, సురేష్ వంటి నేతలు జైళ్లలోనే ఉన్నారు. ఈ చర్యలతో జనంలోనూ కూటమి పలచన అవుతోందని, వైరివర్గంపై ఉన్న ఆలోచన, 164 సీట్లు ఇచ్చిన ప్రజలపై లేదు అన్న అసంతృప్తి రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజాగా సాక్షి మీడియా ప్రతినిధి (Sakshi Media Representative), సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (కెఎస్ఆర్) (Kommineni Srinivasa Rao (KSR)) అరెస్టుతో వైసీపీకి టీడీపీ కొత్తపాఠం నేర్పిందంటున్నారు వైసీపీ శ్రేణులు. కొమ్మినేనిని హైదరాబాద్ (Hyderabad)లోని ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. కొమ్మినేని అరెస్ట్ను వైసీపీ సానుభూతిపరులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సాక్షి టీవీలో జరిగిన ఓ చర్చలో ప్యానలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని బాధ్యత వహించాల్సిన అవసరం లేదని, 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్గా ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ అరెస్ట్ చేయడం దుర్మార్గమని పలు జర్నలిస్ట్ సంఘాలు, కెఎస్ఆర్తో కలిసి పనిచేసి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.
“ఇన్నాళ్లూ వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టి వేధించిన టీడీపీ(TDP), ఇప్పుడు ఏకంగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటోంది. కొమ్మినేని అరెస్ట్ వ్యక్తిగత కక్షసాధింపు చర్యే. గతంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ నుంచి చంద్రబాబు కొమ్మినేనిని తొలగించారు. ఇప్పుడు సాక్షి మీడియాపై, దానికి అనుకూల జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు” అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది రాబోయే ప్రభుత్వాలకు కొత్త పాఠం అని, రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్ జగన్ను, వైసీపీ నేతలపై నోరుపారేసుకున్న జర్నలిస్టులు, ప్యానల్ సభ్యులపై చర్యలకు కూటమి ప్రభుత్వం రూట్ క్రియేట్ చేసింది” అని వైసీపీ సానుభూతిపరులు అంటున్నారు.