వారి పేర్లు చెప్ప‌మ‌ని RRR బెదిరించాడు – IPS సునీల్ సంచ‌ల‌న పోస్ట్‌

వారి పేర్లు చెప్ప‌మ‌ని RRR బెదిరించాడు - IPS సునీల్ సంచ‌ల‌న పోస్ట్‌

క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంటోంది. ఇటీవ‌ల బీహార్ క్యాడ‌ర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయ‌క్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఏపీ పోలీసుల తీరుపై ప‌ట్నా కోర్టు మండిప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న పోస్ట్ చేశారు. ఈ బహిరంగ ప్రకటన రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశమైంది. తనపై నమోదు చేసిన కేసు వెనుక కుట్ర ఉందని, కుల వివక్ష కారణంగానే తాను లక్ష్యంగా మారానని ఆయన ఆరోపించడంతో పాటు ప్ర‌స్తుత డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ బెదిరింపుల కాల్ రికార్డ్ త‌న ద‌గ్గ‌రుంద‌ని ప్ర‌క‌టించ‌డం ఈ కేసులో కీల‌కంగా మార‌నుంది.

ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు..
2021లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి 2024లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొదట తన పేరు లేదని, తర్వాత ఉద్దేశపూర్వకంగా “వాంటెడ్”గా చేర్చారని సునీల్ నాయక్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. తన పాత్ర లేని చోట కేసులో ఇరికించారని ఆరోపించారు.

మాజీ సీఎం పేరు చెప్ప‌మ‌ని బెదిరించారు
ఫిర్యాదు దారుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తనకు ఫోన్ చేసి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాల‌ని ఒత్తిడి తెచ్చాడని, లేకపోతే తానే కేసులో నేరస్తుడిగా మారాల్సి వస్తుందని బెదిరించాడని తెలిపారు. సంబంధిత కాల్ డేటాను (RRR కాల్ డేటా) బయటపెడితే మరికొందరిపై ప్రభావం చూపిన విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

ఎస్టీగా పుట్ట‌డ‌మే నేర‌మా..?
ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఎస్టీ లంబాడి కోటాలో ఐపీఎస్‌గా ఎంపికయ్యానని సునీల్ నాయక్ చెప్పారు. “ఒక లంబాడి కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారి అవ్వడమే నా నేరమా?” అని ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చిన అధికారులు బాడీ కెమెరాలతో వచ్చి, తన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున సరైన సమయంలో ఆధారాలు బయటపెడతానని తెలిపారు. తన తల్లిని అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతానని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున, చట్టపరంగా తన వాదనలు వినిపిస్తానని సునీల్ నాయక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రకటనపై సంబంధిత అధికార వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

ఏపీ పోలీసుల‌కు ప‌రాభ‌వం
బిహార్‌లో ఐపీఎస్ సునీల్ నాయ‌క్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిహార్‌లో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి సునీల్‌ నాయక్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లిన ఎస్పీ దామోదర్‌ తన బృందంతో కలసి బీభత్సం సృష్టించార‌ని, సునీల్‌ నాయక్ ఇంటి గోడదూకి మరీ చొరబడటం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బిహార్‌ పోలీసు యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది. మరోవైపు, ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు తీవ్రంగా మండిపడిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment