- వీరయ్య చౌదరి కెపాసిటీ ఏంటి..? టీడీపీతో ఆయనకున్న సంబంధాలు ఏంటీ..?
- వీరయ్య చౌదరి కేవలం కార్యకర్తే అనుకుంటే.. హత్య జరిగిన వెంటనే హోంమంత్రి హుటాహుటిన ఎందుకు పరుగెత్తుకొచ్చారు..?
- మరుసటి రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు పరుగున అమ్మనబ్రోలు చేరుకున్నారు..?
- ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని మరీ మంత్రి నారా లోకేశ్ వీరయ్య చౌదరి నివాసానికి వచ్చారు ఎందుకు..?
- ఎంపీపీ స్థాయి వ్యక్తికి టీడీపీలో ఎందుకంత ప్రయారిటీ..?
ప్రస్తుతం ఈ ఐదు ప్రశ్నలు ప్రకాశం జిల్లా (Prakasam district) లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి హోంమంత్రి, మంత్రులు ఇలా ఒకరివెంట మరొకరు రావడం.. తాజాగా మంత్రి లోకేశ్ (Lokesh) స్పెషల్ హెలికాప్టర్ (Special Helicopter) వేసుకొని వచ్చి మరీ వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడంతో వెనుక కారణం ఏంటన్న సందేహాలు ప్రజల మదిని తొలుస్తుండగా, ప్రకాశం జిల్లాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వీరయ్య చౌదరి (Veerayya Chowdary) లోకేశ్ బినామీ (Proxy) అని, అందుకే టీడీపీ (TDP) నాయకత్వం అంతా పరుగున అమ్మనబ్రోలుకు చేరుకుందన్న చర్చ ఊపందుకుంది. ప్రకాశం జిల్లాలో లిక్కర్ మాఫియాను వీరయ్య చౌదరి ఏకచక్రాధిపత్యంతో నడిపిస్తున్నాడన్న ఆరోపణలు ఇప్పటికే గుప్పుమంటుండగా, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేశ్ చేసిన యువగళం పాదయాత్ర ఖర్చులన్నీ ఇతనే చూసుకున్నాడని స్థానిక జిల్లా ప్రజలు చర్చించుకుంటుండడం గమనార్హం.
తెలుగుఫీడ్ ముందే చెప్పింది..
వీరయ్య చౌదరిని అతి కిరాతకంగా హత్య చేయించింది స్థానికంగా ఉన్న టీడీపీ నేతలేనని పోలీసుల విచారణలో తేలింది. టీడీపీలో ఆధిపత్యపోరే హత్యకు కారణమని, చంపింది కూడా సొంత సామాజిక వర్గానికి చెందినవారేనని పోలీసులు తేల్చారు. హత్య జరిగిన సమయంలో ఎలాంటి ప్రాథమిక పరిశీలన కూడా చేయకుండా కొన్ని మీడియా ఛానళ్లు వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేశాయి. వీరయ్య చౌదరి హత్యకు ఆధిపత్య పోరే కారణమని స్థానిక సమాచారం ప్రకారం తెలుగు ఫీడ్ ముందే చెప్పింది.
హత్యపై పోలీసుల విచారణ..
2025 ఏప్రిల్ 22న ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. నిందితులు అత్యంత కిరాతకంగా ఆయన ఒంట్లో 50 కత్తిపోట్లు దించారు. చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించిన ఈ కేసును 22 రోజుల తరువాత అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిందితులను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలులో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్దారించారు. అదే గ్రామానికి చెందిన ఆళ్ల సాంబయ్య, ఆయన మేనల్లుడు ముప్పా సురేష్కి వీరయ్య చౌదరికి మధ్య ఉన్న రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా హత్య జరిగినట్టు నిర్ధారించారు. వీరయ్య చౌదరి ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఎలాగైనా తప్పించాలనే కసితోనే టీడీపీ నేతలే ఆయన్ను మట్టుబెట్టారు. హైదరాబాద్లో ఉంటూ ఆర్థికంగా బలంగా స్థిరపడిన ముప్పా సురేష్ తన మేనమామ ఆళ్ల సాంబయ్య కు అన్ని విధాలుగా సహరించినట్టు తేలింది.
ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన విద్య,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్. pic.twitter.com/w70Q3O2rnL
— Telugu Desam Party (@JaiTDP) May 15, 2025
పంచాయతీ ఎన్నికల్లో బీజం..
2021లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆధిపత్య పోరుకి పడిన బీజమే హత్యకు దారితీసింది. వీరయ్య చౌదరి తమను అవమానించాడనే కోపంతో సాంబయ్య తన వర్గంలోని మరో వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించుకున్నాడు. అప్పటి నుండి సాంబయ్యపై వీరయ్య చౌదరి కక్ష పెంచుకొని పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతూ సాంబయ్య ప్రాబల్యాన్ని తగ్గిస్తూ వచ్చాడు. దీంతో సాంబయ్య అవమాన భారంతో రగిలి పోయాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక వీరయ్య జిల్లా రాజకీయాలు శాసిస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చిన సాంబయ్య.. పక్కా ప్లాన్ ప్రకారం వీరయ్య బాధితులందరినీ ఏకం చేసి నెల్లూరుకు చెందిన కిరాయి రౌడీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత నెల 22వ తేదీ సాయంత్రం నలుగురు వ్యక్తులతో హత్య చేయించాడు.
వీరయ్య హత్య.. వైసీపీకి లింకేంటి..?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీరయ్య చౌదరి హత్య తెలుగుదేశం పార్టీలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. సీఎం చంద్రబాబు హుటాహుటిన అమ్మనబ్రోలు గ్రామానికి వచ్చి వీరయ్య చౌదరి మృతదేహాన్నీ సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం మాట్లాడిన తరువాత కొన్ని మీడియా సంస్థలు వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ రకరకాల కథనాలు ప్రచారాలు చేశాయి. చివరికి సొంత పార్టీ నేతలే వీరయ్య చౌదరిని హత్య చేయించారని తేలడంతో అప్పటి వరకు వైసీపీపై ఆరోపణలు చేసిన కొన్ని మీడియా ఛానళ్లు సైలెంట్ అయిపోయాయి. తాజాగా మంత్రి లోకేశ్ ప్రత్యేక హెలికాప్టర్లో వీరయ్య చౌదరి నివాసానికి చేరుకొని పరామర్శించడంపై ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ తెరపైకి రావడం సంచలనంగా మారింది. వీరయ్మ మంత్రి లోకేశ్ బినామీగా చర్చ జరుగుతుండడంపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.





 



