కాకినాడ జిల్లాలో (Kakinada District) ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పిఠాపురం (Pithapuram) లోని జగ్గయ్య చెరువు కాలనీలో క్షుద్రపూజల (Black Magic Rituals) కోసం ఆరు నెలల చిన్నారిని బలి ఇచ్చినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. క్షుద్రపూజలు జరిపిన ఇంటి నూతిలో ఆరు నెలల పసికందు మృతదేహం లభించిన ఘటన సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళ్తే…. జగ్గయ్యచెరువుకాలనీ (Jaggayya Cheruvu Colony)లోని ఓ ఇంట్లో తల్లి తన ఆరు నెలల పసిబిడ్డను (Baby) తన పక్కనే పెట్టుకుని నిద్ర పోతుంది. అర్ధరాత్రి తల్లి మేల్కొనగా పక్కనే తన పసికందు లేకపోవడంతో ఆందోళనగా తలుపులు తెరిచి చూసింది. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పసిబిడ్డకు ఏమైందోనన్న భయంతో బిడ్డ ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతగ్గా పక్కింటి బావిలో చిన్నారి మృతదేహాం (Dead Body) లభించడం సంచలనంగా మారింది.
ఈ ఘటన పిఠాపురంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్షుద్రపూజల కోసమే ఈ హత్య జరిగినట్లు జగ్గయ్య చెరువు కాలనీ వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షుద్రపూజల కోసం పసికందు బలైపోయిందన్న సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నూతిలో లభించిన చిన్నారి మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పసికందు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.